హైదరాబాద్, ఆగస్టు 21,అర్జున్ సమాచారం:
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పీఐబీ పాత్ర కీలకమని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు.
కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం చేపడుతూ ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని గవర్నర్ పిఐబి అధికారులకు సూచించారు.
శుక్రవారం లోక్ భవన్ లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్ ఆధ్వర్యంలో పీఐబీ జాయింట్ డైరెక్టర్ డా. మానస్ కృష్ణకాంత్ ,సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ కె శ్రీనివాస రావు లు కలిశారు.
తెలంగాణలో పీఐబీ, సీబీసీ కార్యకలాపాలను ఈ సందర్భంగా అదనపు డైరెక్టర్ జనరల్
శ్రుతి పాటిల్ గవర్నర్కు వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, విధానాలను మీడియా, ప్రజా అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరవేస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న ‘వార్తాలాప్స్’, ప్రెస్ టూర్స్, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఐసీఓపీ కార్యక్రమాల గురించి వివరించారు.
సెప్టెంబర్లో నిర్వహించే ‘పోషణ్ మాహ్’ సందర్భంగా పోషణ్ అభియాన్పై నిర్వహించనున్న ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అండ్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ( ఐసీఓపీ) కార్యక్రమానికి గవర్నర్ను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీపై ప్రచురించిన పుస్తకంతో పాటు కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల ప్రగతి, విజయాలపై ప్రచురించిన పుస్తకాలను గవర్నర్కు అందజేశారు.
అంతకుముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి లలిత్ వర్మ రాష్ట్ర గవర్నర్ ను కలిశారు.
=========================

