పెద్దపల్లి ,అర్జున్ సమాచార్, జూలై 06: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో పెద్ద ఎత్తున దరఖాస్తులు అందుతున్నాయి. ప్రజల నుంచి వచ్చిన వినతులను నిష్పక్షపాతంగా స్వీకరించి సంబంధిత శాఖలకు పంపిస్తూ పరిశీలన చేపడుతున్నట్లు మంథని రెవెన్యూ డివిజనల్ అధికారి సురేష్ తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తోందని దరఖాస్తుదారులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం చేపట్టిన సాదా బైనామా దరఖాస్తుల పరిశీలనలో పట్టాదారుల పేర్లతో ఫోర్జరీ సంతకాలు చేసి దరఖాస్తులు సమర్పిస్తున్న ఘటనలను క్షుణ్ణంగా విచారించి నిజమైన పట్టాదారులకు న్యాయం చేయాలని పలువురు ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేస్తున్నారు.
ఈ సందర్భంగా మంథని మండలం బిట్టుపల్లి, జిల్లెల్లపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 56లో గల 3 ఎకరాల 3 గుంటల భూమికి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో సాదా బైనామా దరఖాస్తు సమర్పించారని ఆరోపిస్తూ, ఆ దరఖాస్తును నిలిపివేయాలని కోరుతూ మహావాది సరోజినీదేవి కుమారుడు సతీష్ కుమార్ ఆధారాలతో సహా ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. అలాగే బిట్టుపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 68/1లోని 5 ఎకరాల 17 గుంటలు, 68/2లోని 4 గుంటల భూములకు సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా అధికారులకు సమర్పించినట్లు సతీష్ కుమార్ తెలిపారు.
