అర్జున్ సమాచారం, తెలంగాణ ప్రతినిధి : రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల దుష్పరిణామాలు, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంథని సీఐ శ్రీ బి. స్వామి గారు, రామగిరి ఎస్ఐ శ్రీ తాడవేన శ్రీనివాస్ గారు హాజరై గ్రామ ప్రజలకు పలు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు.
పోలీసు అధికారులు మాట్లాడుతూ సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు సమాచారం వంటి వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, మెసేజ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
అలాగే గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, వాటి వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబం మరియు సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడతాయని వివరించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ వినియోగించడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి పుల్లెల భాగ్యలక్ష్మి కొమరయ్య, ఉపసర్పంచ్ కలవేన శ్రీకాంత్ ముదిరాజ్, 1వ వార్డు సభ్యురాలు కాల్వ రజిత శ్రీనివాస్, 4వ వార్డు సభ్యులు కన్నూరి శశికుమార్, 6వ వార్డు సభ్యురాలు పుట్ట లక్ష్మి, 7వ వార్డు సభ్యురాలు కదాసి ఓదమ్మ రమేష్, 8వ వార్డు సభ్యురాలు కలవేన స్వరూప రమేష్, మాటేటి రవి, మాటేటి రాజబాబు, పొట్ల రవి తదితరులు, గ్రామ ప్రజలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసు అధికారుల సూచనలను ఆసక్తిగా విన్నారు.

