జన్నారంలో కన్నులపండువగా ‘హర్ ఘర్ తిరంగ’ ర్యాలీ.ముక్తకంఠంతో మార్మోగిన ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు.
జన్నారం ప్రతినిది: ( అర్జున్ సమాచార్) ఆగస్టు 12.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ, దేశభక్తి భావనను చాటిచెప్పేలా జన్నారం మండల కేంద్రంలో ‘హర్ ఘర్ తిరంగ’ ర్యాలీ బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు, బీజేపీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు.స్థానిక ధర్మారం చౌరస్తా నుండి ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ తెలంగాణ తల్లి విగ్రహం వరకు సాగింది. వివిధ పాఠశాలల విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు చేతబూని “భారత్ మాతాకీ జై”, “వందేమాతరం” అంటూ చేసిన నినాదాలతో జన్నారం పురవీధులు మారుమోగాయి. మువ్వన్నెల జెండాల శోభతో వీధులన్నీ దేశభక్తి పరవశంలో మునిగిపోయాయి.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. చిన్నతనం నుంచే పిల్లల్లో జాతీయ భావాలను పెంపొందించడంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు, ప్రధాన కార్యదర్శులు రమేష్, జగన్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కొంతం శంకరయ్య, ఎస్టీ మోర్చా రాష్ట్ర నాయకుడు బద్రి నాయక్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బెడద గోపాల్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పవన్ యాదవ్, జిల్లా నాయకుడు గోలి చందు, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు బోడ తిరుపతి, బీజేవైఎం మండల అధ్యక్షుడు కందుల రమేష్ పాల్గొన్నారు. సర్పంచులు లక్ష్మిరాజం, వాసాల నరేష్, పొనకల్ ఉపసర్పంచ్ అప్పల జలపతి, బూత్ అధ్యక్షులు యుగంధర్, పట్టణ అధ్యక్షులు సూర్యం,సత్తయ్య, వేయికండ్ల రవిలతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు

