కరీంనగర్,అర్జున్ సమాచారం:
సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ప్రముఖ ప్లాస్టిక్ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ శశికాంత్ మద్దు ఆధ్వర్యంలో ‘ప్లాస్టిక్ శస్త్రచికిత్సల అత్యుత్తమ కేంద్రం’ను ప్రారంభించారు. ఈ కేంద్రంలో సౌందర్య, పునర్నిర్మాణ శస్త్రచికిత్సలతో పాటు రైనోప్లాస్టీ, లైపోసక్షన్, చిన్నారుల క్లిష్టమైన పునర్నిర్మాణ శస్త్రచికిత్సలకు ప్రత్యేక సేవలు అందించనున్నారు.అని గురువారం రోజున కరీంనగర్ యశోద సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో డా శశికాంత్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,ముఖ సౌందర్యంతో పాటు, శ్వాస సంబంధిత సమస్యలను సరిదిద్దేందుకు ప్రాథమిక, పునః, సహజ ఆకృతి పరిరక్షణ, కార్యాచరణ ఆధారిత రైనోప్లాస్టీ సేవలు అందుబాటులో ఉంటాయి. సహజ ఫలితాల కోసం త్రిమితీయ చిత్రీకరణ, ఛాయాచిత్రాలు, అనుకరణ, శస్త్రచికిత్స ప్రణాళిక వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నారు. శరీర ఆకృతిని మెరుగుపరిచేందుకు అధునాతన కొవ్వు తొలగింపు విధానాలతో పాటు కొవ్వు మార్పిడి చికిత్సలు కూడా నిర్వహిస్తారు.అన్నారు. పుట్టుకతో వచ్చే చీలిక పెదవి, అంగిలి, చెవి లోపాలు, ముఖ కపాల నిర్మాణ అసాధారణతలు, కాలిన గాయాల వల్ల ఏర్పడిన వైకల్యాలు, రక్తనాళాల నిర్మాణ లోపాలతో బాధపడే చిన్నారులకు ప్రత్యేక పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు అందిస్తారు. చిన్నారుల మత్తు వైద్యం, బాల వైద్యం, మాట చికిత్స, భౌతిక చికిత్స నిపుణులతో కూడిన సమగ్ర బృందం చికిత్స అనంతరం పర్యవేక్షణ అందిస్తుందని,ప్లాస్టిక్ శస్త్రచికిత్స కేవలం రూపాన్ని మార్చడానికే పరిమితం కాదని, అవయవాల పనితీరును మెరుగుపరిచి బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. అత్యాధునిక వైద్య సాంకేతికతతో కూడిన సేవలను హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల ప్రజలకు చేరువ చేయడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ విలేకరుల సమావేశం లో రాజేందర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
======================

