భీమవరం, జూలై 1,అర్జున్ సమాచారం:
ప్రజలు, భక్తుల చిరకాల కోరిక నెరవేరిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. నర్సాపురం–అరుణాచలం (తిరువణ్ణామలై) వీక్లీ ఎక్స్ప్రెస్ను పూర్తిస్థాయి రెగ్యులర్ రైలుగా మార్చి బుధవారం భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. గత ఏడాది జూలై 9న ప్రత్యేక రైలుగా ప్రారంభమైన ఈ సర్వీస్కు 110 శాతం ఆక్యుపెన్సీ నమోదవడంతో రైల్వే ఉన్నతాధికారులతో చర్చించి రెగ్యులర్ సర్వీస్కు అనుమతులు సాధించినట్లు వెల్లడించారు.
జూలై 10 నుంచి నర్సాపురం–బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ సేవలు కూడా ప్రారంభం కానున్నాయని తెలిపారు. అలాగే నర్సాపురం–విశాఖపట్నం రైలు, నర్సాపురం–వారణాసి డైరెక్ట్ రైలు సదుపాయం కల్పించడంతో పాటు తాడేపల్లిగూడెంలో వందే భారత్ ఎక్స్ప్రెస్కు హాల్ట్ మంజూరు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
అమృత్ స్టేషన్ పథకం కింద భీమవరం టౌన్, తాడేపల్లిగూడెం, నర్సాపురం రైల్వే స్టేషన్లను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసే పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, రాష్ట్రంలోని ఇతర పార్లమెంట్ నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలిచేలా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు.
==========================

