ePaper
Saturday, August 22, 2026
ePaper
Homeజాతియంఢిల్లీమారని ట్రంప్...భారత్ పై మళ్లీ టారిఫ్

మారని ట్రంప్…భారత్ పై మళ్లీ టారిఫ్

📰 Generate e-Paper Clip


మారని ట్రంప్… భారత్ పై మళ్లీ టారిఫ్
న్యూఢిల్లీ, జూలై  24, (అర్జున్ సమాచారం ప్రతినిధి).
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. భారత్ సహా మరో 16 దేశాలపై కొత్త అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. కార్మికుల వెట్టిచాకిరీతో తయారైన ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం అమలుకు సంబంధించిన విచారణ అనంతరం అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ ఇప్పటికే విదేశీ వాణిజ్య విధానాన్ని సవరించినందుకు 12.5 శాతానికి బదులుగా 10 శాతం టారిఫ్స్ మాత్రమే విధించింది.భారత్- అమెరికా మధ్య ఒకవైపు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై  చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. అమెరికా మధ్యలోనే ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. భారత్ సహా మరో 16 దేశాల నుంచి దిగుమతి అయ్యే కొన్ని ఉత్పత్తులపై 10 శాతం అదనపు సుంకాల్ని విధిస్తున్నట్లు ప్రకటించింది. కార్మికుల బలవంతపు శ్రమతో (వెట్టిచాకిరి) తయారైన ఉత్పత్తుల దిగుమతుల్ని అడ్డుకునే నిబంధనల అమలుపై జరిపిన విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్  వెల్లడించింది. ఈ సుంకాల గురించి యూఎస్ ప్రెసిడెంట్ ఎప్పటి నుంచో బెదిరిస్తూ వస్తుండగా తాజాగా వాటిని అమల్లోకి తెచ్చారు.అమెరికా ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 301 కింది విచారణ చేపట్టింది. కార్మికుల వెట్టిచాకిరీతో తయారైన వస్తువుల దిగుమతుల్ని నిషేధించే చట్టాల్ని ఆయా చట్టాలు అమలు చేస్తున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించింది. విచారణ అనంతరం నిషేధ నిబంధనలు అమలు చేసిన లేదా చేస్తామని హామీ ఇచ్చిన దేశాలకు 10 శాతం, అలాంటి చర్యలు తీసుకోని దేశాలకు 12.5 శాతం సుంకాల్ని విధించాలని నిర్ణయించింది.జూన్ 14న భారత్ తన విదేశీ వాణిజ్య విధానంలో మార్పులు చేసింది. కార్మికుల బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల దిగుమతుల్ని నిషేధించే నిబంధనల్ని చేర్చింది. దీంతో అమెరికా మొదట ప్రతిపాదించిన 12.5 శాతం అదనపు సుంకాలకు బదులు భారత్‌పై తగ్గించి 10 శాతం విధించింది. భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, కంబోడియా, యూకే ఇలా మొత్తం 17 దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు అమలు చేయనున్నట్లు అమెరికా స్పష్టం చేసింది.ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై తొలి దశ చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమిసన్ గ్రీర్‌తో సమావేశమయ్యారు. ఒప్పందానికి సంబంధించి ప్రాథమిక రూపురేఖలు ఇప్పటికే ఖరారైనట్లు సమాచారం. వీలైనంత త్వరలోనే ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.’కార్మికుల వెట్టిచాకిరీతో తయారైన వస్తువులపై చర్యలు తీసుకుంటున్న దేశాల్ని స్వాగతిస్తున్నామని’ యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమిసన్ గ్రీర్ చెప్పారు. ఈ చర్యల ద్వారా మానవ హక్కుల పరిరక్షణతో పాటు అంతర్జాతీయ వాణిజ్యంలో సమాన అవకాశాలు కల్పించాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం విధించిన అదనపు టారిఫ్స్ 10 శాతానికి పరిమితమైనప్పటికీ అమెరికా మార్కెట్‌కు ఎగుమతి చేసే కొన్ని రంగాలపై అదనపు వ్యయభారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే సుంకాలు అమల్లో ఉండగా.. ఎంపిక చేసిన వస్తువులపై ఈ అదనపు సుంకాల భారం పడనుంది. అయితే వాణిజ్య ఒప్పందం కుదిరితే భవిష్యత్తులో ఈ సుంకాల భారం తప్పే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!