భద్రాద్రి కొత్తగూడెం,అర్జున్ సమాచారం:
భద్రాచలం వద్ద గోదావరి నదికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అయిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విస్తా కాంప్లెక్స్ స్లూయిస్, గోదావరి కరకట్ట, స్నాన ఘాట్లు, వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ప్రజల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, గోదావరిలో వరద ప్రవాహం తీవ్రంగా ఉన్నందున జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గోదావరి స్నాన ఘాట్లు, నదీ తీర ప్రాంతాలు, లోతట్టు గ్రామాలు, ఇతర పర్యాటక ప్రాంతాల్లో గస్తీని మరింత ముమ్మరం చేయాలని సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలను గోదావరిలోకి అనుమతించవద్దని, సెల్ఫీలు, వీడియోల కోసం ప్రమాద ప్రాంతాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మత్స్యకారుల వివరాలను సేకరించి, వరద ఉధృతి తగ్గే వరకు ఎవరూ నదిలో చేపల వేటకు వెళ్లకుండా హెచ్చరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న డిడిఆర్ఎఫ్ బృందాలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు ప్రతి పోలీసు వాహనంలో లైఫ్ బోయ్లు, లైఫ్ జాకెట్లు, టార్చ్ లైట్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తదితర విపత్తు నిర్వహణ పరికరాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
ప్రజల నుంచి వచ్చే అత్యవసర సమాచారం, ఫిర్యాదులపై వెంటనే స్పందించి వేగవంతమైన సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ అధికారులు ఎస్డీఆర్ఎఫ్ , డీడీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకుని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
============================

