జనగామ,అర్జున్ సమాచారం:
శుక్రవారం, జిల్లాలోని పాలకుర్తి మండలం, గూడూరు గ్రామంలోని రెండు పడక గదుల లేఅవుట్ లో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించి, దెబ్బతిన్న రోడ్ల నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా రోడ్డు కొలతలను ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్, రోడ్ల వెడల్పు, పొడవు, ఇతర కొలతలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రోడ్ల నిర్మాణానికి రూపొందించిన అంచనాల ప్రకారం పనులు చేపట్టాలని, ఎక్కడా నాణ్యతలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు.
లేఅవుట్ పరిసరాల్లో పేరుకుపోయిన బురద, చెత్తను వెంటనే తొలగించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఆదేశించారు. మొత్తం ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. నివాసితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేయాలని చెప్పారు.
2 బీహెచ్కే లేఅవుట్లోని అంతర్గత రహదారులు, డ్రైనేజీ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా నిర్వహించాలని, పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృ నాయక్, నీటి పారుదల శాఖ ఈఈ ప్రవీణ్ కుమార్, గృహ నిర్మాణ శాఖ డీఈ చంద్ర శేఖర్, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
============================

