భీమారం మండల కేంద్రంలో ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ వేడుకలు
భీమారం:(మంచిర్యాల), అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 17:
భీమారం మండల కేంద్రంలో అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ భీమారం మండల కమిటీ ఆధ్వర్యంలో శ్రీమద్విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ముందుగా విశ్వకర్మ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు పూసల రమేష్, మండల ప్రధాన కార్యదర్శి పూసల రాజేష్ విశ్వకర్మ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక యజ్ఞ పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు
ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణులు మాట్లాడుతూ, హిందూ పురాణాలు మరియు సంప్రదాయాల ప్రకారం శ్రీమద్విరాట్ విశ్వకర్మ భగవానుడు దివ్య వాస్తుశిల్పిగా, సృష్టికర్తగా కొలవబడుతున్నారని తెలిపారు. దేవతల రథాలు, ఆయుధాలు, వివిధ దివ్య నిర్మాణాలను విశ్వకర్మ భగవానుడు నిర్మించినట్లు పురాణాల్లో ప్రతీతి ఉందన్నారు.
విశ్వకర్మ భగవానుడి ఐదు ముఖాల నుంచి మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ అనే ఐదుగురు బ్రహ్మర్షులు ఉద్భవించారని విశ్వాసం ఉందన్నారు. అలాగే శ్రీకృష్ణుడి ద్వారకా నగరం, లంకా నగరం, ఇంద్రప్రస్థ తదితర అద్భుత నిర్మాణాలను విశ్వకర్మ నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయని వివరించారు.
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా కర్మాగారాలు, పరిశ్రమలు, శిల్పశాలలు, వృత్తి కేంద్రాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ నూతి రాంచందర్,మంచిర్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పుసాల రుద్ర శర్మ , జిల్లా ఈసీ మెంబెర్ నూతి మధుశర్మ , మండల కార్యవర్గ సభ్యులు నాoపెల్లి రమేష్,పూసల శ్యామ్ సుందర్,గనముక్కల నర్సయ్య,వొళవోజు బ్రహ్మయ్య, పూసల కిరణ్య బాబు మేరాడి గొండ రామన్న, పాలిక రమేష్, తంగళ్లపెల్లి రమేష్, రంగు జయప్రకాష్, సిహెచ్. భరత్ భక్తులు, విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

