కాళేశ్వరం జోన్ క్లస్టర్–సి పోలీస్ క్రీడా పోటీలు ప్రారంభంపోటీలను ప్రారంభించిన రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 21:
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోనగోదావరిఖని ఆర్సీఓ క్లబ్లో నిర్వహిస్తున్న 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీలు–2026 క్లస్టర్–సి కాళేశ్వరం జోన్ పోలీస్ క్రీడా పోటీలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. షటిల్ బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్ క్రీడల్లో ఓపెన్ విభాగంతో పాటు 18–30, 40 ఏళ్లు పైబడినవారు, 50 ఏళ్లు పైబడినవారి విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం జోన్ పరిధిలోని రామగుండం పోలీస్ కమిషనరేట్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు చెందిన పోలీస్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన క్రీడాకారులు వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో కాళేశ్వరం జోన్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ జట్టు సమన్వయం, పరస్పర సహకారం, నిరంతర సాధనతో పాటు తమ లోపాలను గుర్తించి సరిదిద్దుకోవడం ద్వారా విజయాలు సాధించవచ్చన్నారు. పోలీస్ విధుల్లో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, సమన్వయం, జట్టు స్ఫూర్తి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బందిలో శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సమన్వయం, జట్టు భావన పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది క్రీడాస్ఫూర్తిని అలవర్చుకుని పరస్పర విశ్వాసంతో సమిష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు. క్రీడల్లో పాల్గొనే పోలీస్ అధికారులు, సిబ్బందికి పోలీస్ శాఖ తరఫున పూర్తి సహకారం, అవసరమైన మద్దతు అందిస్తామని సీపీ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ–పరిపాలన కె.శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐలు దామోదర్, పెద్దన్న, రమేష్, మల్లేశం, ఆర్ఎస్ఐలు వెంకట్, శివ తదితరులు పాల్గొన్నారు.

