మిట్టపల్లి సమస్యలపై ప్రజావాణిలో వినతులు..వంతెనకు ముప్పు.. స్మశానవాటిక, చెరువు భూములపై కబ్జాల ఆరోపణలు..తక్షణమే పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్..
అర్జున్ సమాచారం. ఆగస్టు 24. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
జైపూర్: మిట్టపల్లి గ్రామానికి సంబంధించిన పలు సమస్యల పరిష్కారం కోసం భారత రాష్ట్ర సమితి వార్డు సభ్యులు, నాయకులు జైపూర్ మండల కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రాలు సమర్పించారు.
గ్రామంలో ప్రధాన సమస్యలుగా ఉన్న మూడు అంశాలను అధికారులు దృష్టికి తీసుకెళ్లినట్లు నాయకులు తెలిపారు. మిట్టపల్లి పెద్దవాగుపై నిర్మించిన వంతెన ముందు భాగం వరదల కారణంగా దెబ్బతిని కూలిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వర్షాకాలంలో ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని కోరారు.
గ్రామంలోని బొందలగడ్డ స్మశానవాటికకు చెందిన సుమారు ఎకరం భూమి చుట్టుపక్కల వారి ఆక్రమణకు గురైందని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు గ్రామానికి వచ్చి సర్వే నిర్వహించి, స్మశానవాటిక భూమికి స్పష్టమైన హద్దులు నిర్ణయించాలని వినతిపత్రంలో కోరారు.
అదే విధంగా మిట్టపల్లి గ్రామంలోని సాకికుంట చెరువుకు చెందిన సుమారు ఇరవై గుంటల భూమి ఆక్రమణకు గురైందని తెలిపారు. రెవెన్యూ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి చెరువు హద్దులను గుర్తించాలని కోరారు.
మూడు ప్రధాన సమస్యలను ప్రజావాణి కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు నాయకులు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాము ఎప్పుడూ ముందుండి పోరాడతామని భారత రాష్ట్ర సమితి వార్డు సభ్యులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జాగటి వెంకటస్వామి, దుట సంతోష్, రమటెంకి మల్లేష్, కొట్రంగి అంజన్న, కొట్రంగి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

