రంగంలోకి దిగిన అధికారులుఫౌంహౌస్ లెక్కలు తేల్చేస్తారా.
హైదరాబాద్, సెప్టెంబర్ 19, (అర్జున్ సమాచారం డెస్క్ సెప్టెంబర్ 19.
తెలంగాణ రాజకీయాల్లో ఏళ్ల తరబడి ఒక మిస్టరీగా, అధికార కేంద్రానికి ప్రతిరూపంగా నిలిచిన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్హౌస్ కాంపౌండ్ ఇప్పుడు చట్టపరమైన, పరిపాలనాపరమైన చక్రబంధంలో చిక్కుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన 30 రోజుల డెడ్లైన్ ప్రకటన ఊరికే కాదని నిరూపిస్తూ, రెవెన్యూ యంత్రాంగం వేగంగా ఆచరణలోకి దిగింది. మార్కూక్ తహశీల్దార్ కార్యాలయంలో గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ నేతృత్వంలో సర్వేయర్లు, రెవెన్యూ ఉన్నతాధికారులు అత్యవసర సమీక్ష నిర్వహించి, ఫామ్హౌస్ పరిధిలోని పాత పహాణీలు, భూముల క్రయవిక్రయాల రికార్డులను క్షుణ్ణంగా తవ్వితీస్తున్నారు.ఈ గ్రౌండ్-లెవల్ ఆపరేషన్ అంతిమ లక్ష్యం.. ఫామ్హౌస్ కాంపౌండ్ వాల్ లోపల ఉన్నది కేవలం కేసీఆర్ చెబుతున్న పట్టా భూములు మాత్రమేనా లేక దళితులకు కేటాయించిన సీలింగ్, అసైన్డ్, ప్రభుత్వ కాలువల స్థలాలు ఏమైనా ఆక్రమణకు గురయ్యాయా అనే నిర్దిష్టమైన ప్రశ్నలకు చట్టబద్ధమైన సమాధానాలు రాబట్టడమే. క్షేత్రస్థాయి డిజిటల్ ల్యాండ్ సర్వే చేపట్టడానికి ముందు చట్టపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు, భూ సర్వే నిబంధనల ప్రకారం భూ యజమానులకు ముందస్తు నోటీసులు జారీ చేయడానికి అధికారులు లీగల్ కసరత్తు పూర్తి చేస్తున్నారు. అతి త్వరలోనే కేసీఆర్తో పాటు సంబంధిత ప్రతినిధులకు ఈ అధికారిక నోటీసులు అందనున్నట్లు సమాచారం.ఈ పరిణామం రేవంత్ రెడ్డి సర్కార్ చేపడుతున్న ఆపరేషన్ను కేవలం రాజకీయ విమర్శల స్థాయి నుంచి రెవెన్యూ రికవరీ స్థాయికి తీసుకెళ్లింది. శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలు చూపించడమే కాకుండా, నెల రోజుల గడువు పెట్టి సిద్దిపేట జిల్లా కలెక్టర్ను బాధ్యుడిని చేయడంతో అధికారులు ఏమాత్రం ఉపేక్షించకుండా ఫైల్స్ను సిద్ధం చేస్తున్నారు. సర్వే నిర్వహణ సమయానికి భూ యజమానులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలోనే కొలతలు వేయాలని భావిస్తుండటంతో, ఎర్రవల్లి పరిసరాల్లో మునుపెన్నడూ ఉత్కంఠ వాతావరణం నెలకొంది.ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ను రాజకీయంగా నిరోధించలేక, కాంగ్రెస్ ప్రభుత్వం పాత కక్షలతోనే నోటీసులు, విచారణల పేరుతో హడావుడి చేస్తోందని మండిపడుతున్నాయి. గత పదేళ్లలో లేని భూ సమస్యలు ఇప్పుడు కొత్తగా ఎలా ఊడిపడ్డాయని, ఇది తమ అధినేత మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు అధికార పక్షం ఆడుతున్న కక్షసాధింపు నాటకమని విమర్శిస్తున్నాయి. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములపై బురదజల్లడం కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగమేనని గులాబీ నేతలు స్పష్టం చేస్తున్నారు. 30 రోజుల కాలమితిలో రెవెన్యూ యంత్రాంగం ఇచ్చే డిజిటల్ సర్వే నివేదిక ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలకు దిగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఆక్రమణలో ఉన్నట్లు సర్వేలో తేలితే, వాటిని స్వాధీనం చేసుకుని దళితులకు పంపిణీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్ నెరవేరుతుందా లేదా ఈ వివాదం సుదీర్ఘ న్యాయపోరాటానికి దారితీస్తుందా అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలనుంది.

