ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeజాతియంఢిల్లీజీవితంలో అడ్డదారుల వెంట పడొద్దు యువతకు ప్రధాని సూచన

జీవితంలో అడ్డదారుల వెంట పడొద్దు యువతకు ప్రధాని సూచన

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ ఆగస్టు 12,అర్జున్ సమాచారం:
నరేంద్ర మోదీ నేటి తరం యువతకు (జెన్-జీ) పలు కీలక సూచనలు చేశారు. జీవితంలో అడ్డదారుల వెంట పడొద్దని, అవి అంతిమంగా తీవ్ర నష్టాలకే దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, రీల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం నాడు ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్’ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.రైల్వే స్టేషన్లలో తరచూ కనిపించే ఒక హెచ్చరికను ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. “షార్ట్‌కట్ విల్ కట్ యు షార్ట్” (అడ్డదారి మీ జీవితాన్ని కుదిస్తుంది) అనే బోర్డు కేవలం రైల్వే ట్రాక్‌లకే కాకుండా, నిజ జీవితానికి కూడా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫుట్‌ ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులో ఉన్నప్పటికీ, త్వరగా వెళ్లాలనే తొందరలో కొందరు ప్రమాదకరంగా పట్టాలు దాటుతుంటారని, అటువంటి అనాలోచిత నిర్ణయాలు ప్రాణాంతకమని ఆయన హెచ్చరించారు.యువత తప్పుడు మార్గాలను వీడి, అర్థవంతమైన జీవన గమనాన్ని ఎంచుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. “మీరు ఆరాధించే మహనీయుల జీవిత చరిత్రలను తప్పనిసరిగా చదవండి. వాటి ద్వారా స్ఫూర్తి పొంది సరైన మార్గాన్ని కనుగొనవచ్చు” అని ఆయన యువతకు సలహా ఇచ్చారు. ముఖ్యంగా ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసే ఇన్‌ఫ్లుయెన్సర్ల కంటెంట్ పట్ల నిరంతరం జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవు పలికారు.కష్టాల్లోనూ విలువలను వదలని జీవితంరామ్‌నాథ్ కోవింద్ జీవితంలోని పేదరికం, పరిమిత వనరులు, కష్టాలను ప్రస్తావించిన ప్రధాని మోదీ, వాటిని ఆయన బలహీనతలుగా మారనివ్వలేదన్నారు. విద్య, కష్టపడి పనిచేయడం, నిజాయితీ, సేవాభావం వంటి విలువలతో ఆయన అత్యున్నత రాజ్యాంగ పదవికి చేరుకున్నారని ప్రధాని గుర్తు చేశారు. రామ్‌నాథ్ కోవింద్ చిన్నతనంలో ఆయన తల్లి అగ్నిప్రమాదంలో మరణించిన విషాద సంఘటనను కూడా మోదీ ప్రస్తావించారు. ఆ కష్ట సమయంలో పొరుగింటి మహిళ కుటుంబానికి అండగా నిలిచిన సంఘటన రామ్‌నాథ్ కోవింద్‌లో సామాజిక ఐక్యత, సామరస్యంపై లోతైన అవగాహన పెంచిందని వివరించారు. ఆయన తండ్రి కుటుంబాన్ని నిలబెట్టి పిల్లలకు విలువలను నేర్పిన తీరు రామ్‌నాథ్ కోవింద్ జీవితంపై ప్రభావం చూపిందని ప్రధాని మోదీ చెప్పారు.మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే వంటి మహనీయులు పేదలు, అణగారిన వర్గాలకు కూడా దేశంలో అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉండాలని కలలు కన్నారని మోదీ అన్నారు. రామ్‌నాథ్ కోవింద్ వంటి వ్యక్తులు తమ కృషి, సామర్థ్యంతో ఆ కలను సాకారం చేసే భారత ప్రజాస్వామ్య ప్రయాణానికి తోడ్పడ్డారని పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశానికి ఇలాంటి అంకితభావం కలిగిన లక్షలాది యువత అవసరమని ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు.
“ఒకే దేశం, ఒకే ఎన్నిక” కోసం కోవింద్ సేవలు
రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజా జీవితానికి సంబంధించిన అంశాలపై పనిచేస్తున్నారని మోదీ ప్రశంసించారు. ప్రత్యేకంగా “ఒకే దేశం, ఒకే ఎన్నిక”  అంశంపై కోవింద్ చేస్తున్న కృషిని ప్రస్తావించారు. ఈ అంశానికి పరిష్కారం లభిస్తే భారత ప్రజాస్వామ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రధాని మోదీ అన్నారు. రామ్‌నాథ్ కోవింద్ సేవాభావం, అంకితభావం నుంచి దేశ ప్రజలు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథలో ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ప్రతికూల పరిస్థితుల్లోనూ నిజాయితీ, విలువలు, స్వచ్ఛత విషయంలో రాజీ పడకుండా ఎలా ఎదిగారనే అంశాలు ఉన్నాయని మోదీ చెప్పారు. తన జీవితంలోని కష్టాలు వ్యక్తిగతమైనవైనా, వాటి ఫలితంగా వచ్చిన విజయం మాత్రం భారత గణతంత్రం, ప్రజాస్వామ్య విజయం అని పుస్తక శీర్షికను విశ్లేషిస్తూ మోదీ పేర్కొన్నారు. ఈ పుస్తకం కోవింద్ జీవితంలోని జ్ఞాపకాలను మాత్రమే కాకుండా, భారత ప్రజాస్వామ్య ప్రయాణంలోని ముఖ్య ఘట్టాలను కూడా భవిష్యత్ తరాలకు భద్రపరుస్తుందని ఆయన అన్నారు.

===========

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!