సిద్దిపేట,అర్జున్ సమాచారం:
విపంచి ఆడిటోరియంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం ప్రారంభించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు.
వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే, రాకముందే గుర్తించి నివారించుకోవడం ఉత్తమ మార్గం అని మాజీ మంత్రి బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు స్పష్టం చేశారు.ప్రారంభ దశలో గుర్తింపే క్యాన్సర్పై విజయానికి కీలకం అన్నారు.
సిద్ధిపేటలోని విపంచి ఆడిటోరియంలో సింధూ హాస్పిటల్ సహకారంతో నిర్వహిస్తున్న రెండు రోజుల ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ. ఆరోగ్యం కంటే గొప్ప సంపద మరొకటి లేదని, వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందుగానే గుర్తించి నివారించుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు.
క్యాన్సర్ కు భయపడాల్సిన అవసరం లేదని, ప్రారంభ దశలో గుర్తిస్తే అనేక రకాల క్యాన్సర్లను పూర్తిగా నయం చేయవచ్చని చెప్పారు.
ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన మహిళలు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాలని సూచించారు.
కేన్సర్ వ్యాధితో కుటుంబాలు అన్ని రకాలుగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మారిన జీవనశైలి ఆహారపు అలవాట్లు క్యాన్సర్ కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయి అన్నారు.
ఈ శిబిరంలో నిర్వహిస్తున్న మామోగ్రామ్, పాప్ స్మియర్ వంటి పరీక్షలు సాధారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఖర్చవుతాయని, ఇక్కడ మాత్రం పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పొగాకు, గుట్కా, పాన్ మసాలా వంటి అలవాట్లు నోటి క్యాన్సర్కు ప్రధాన కారణాలని పేర్కొంటూ, అలాంటి అలవాట్లను కుటుంబ సభ్యులకు మాన్పించే బాధ్యత అందరిదని అన్నారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన హైదరాబాద్ సింధూ హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది, నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు
==============================

