విశాఖపట్నం,అర్జున్ సమాచారం:
ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం(IBM) విశాఖపట్నంలో తన నూతన ఐబీఎం కన్సల్టింగ్ ఫ్యూచర్ నౌ సెంటర్ (FutureNow Centre)ను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ సేవలకు మద్దతుగా విశాఖ ఇసుకతోట జంక్షన్ లోని లాన్సమ్ స్వ్కేర్ భవనంలో ఐబీఎం సంస్థ ఏర్పాటుచేసిన ఫ్యూచర్నౌ సెంటర్ను ఐబీఎం ఇండియా, సౌత్ ఏసియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ తో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐ గవర్నెన్స్ ఇంటిలిజెన్స్, కెమికల్స్ అండ్ పెట్రోలియం ఇండస్ట్రీ ఆపరేషన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కన్సల్టింగ్ సేవలు, ఏఐ(AI) ఫస్ట్ ట్రాన్స్ ఫర్మేషన్ ప్రాజెక్టులకు మద్దతుగా ఐబీఎం కన్సల్టింగ్ ఫ్యూచర్నౌ సెంటర్ ను ఏర్పాటుచేయడం జరిగింది. భారతదేశ సాంకేతిక ఆవిష్కరణలు, ప్రతిభావంతులైన మానవ వనరుల అభివృద్ధిపై సంస్థ కొనసాగిస్తున్న పెట్టుబడులకు ఇది మరో కీలక ముందడుగు కానుంది. ఈ సెంటర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులకు కన్సల్టింగ్, సాంకేతిక సేవలను అందించనుంది. ఇందులో కృత్రిమ మేధస్సు (AI), హైబ్రిడ్ క్లౌడ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా & అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైజ్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి కీలక రంగాల్లో సేవలు అందించనున్నారు. అదేవిధంగా ఏఐ ఆధారిత క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్, ప్లాట్ఫార్మ్ ఇంజనీరింగ్, సర్వీస్ ఇంటిగ్రేషన్, క్వాలిటీ ఇంజనీరింగ్, యూజర్ ఎక్స్పీరియన్స్ సేవలకు ఇది ప్రధాన కేంద్రంగా పనిచేయనుంది.
ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ వర్క్ ఫోర్స్ అభివృద్ధే లక్ష్యం
భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న సాంకేతిక కేంద్రాల్లో ఆవిష్కరణలు, సేవల సామర్థ్యాలను విస్తరించాలన్న ఐబీఎం లక్ష్యానికి ఈ ఫ్యూచర్నౌ సెంటర్ ప్రతీకగా నిలుస్తోంది. విస్తృత సాంకేతిక ప్రతిభ, బలమైన విద్యాసంస్థలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పర్యావరణ వ్యవస్థతో విశాఖపట్నం ప్రపంచ ఖాతాదారుల అవసరాలను తీర్చేందుకు అనువైన కేంద్రంగా ఎదుగుతోంది. ఈ సెంటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఐబీఎం తన కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన సాంకేతిక నైపుణ్యాలున్న మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడాలని లక్ష్యంగా పెట్టుకుంది.
==============================

