అర్జున్ సమాచారం:
ఎన్డీఏలో ఇటీవల చేరిన ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక సూచనలు చేశారు. శుక్రవారం పార్లమెంట్ సమావేశాలకు ముందు అల్పాహారం సందర్భంగా 45 మంది ఎంపీలతో దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) నుంచి ఏక్నాథ్ శిందే వర్గంలో చేరిన ఎంపీలు, తృణమూల్ రెబెల్స్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘కొత్త పార్టీ అని ఆందోళన చెందొద్దు. మీకు నేనున్నాను. ఎన్డీఏ కుటుంబంలో ప్రతి వ్యక్తికి గౌరవం, రాజకీయాల్లో అవకాశం ఇస్తాం’’ అన్నారు. ఎన్డీఏలోని ప్రతి ఎంపీకి తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఎంపీలు తమ రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాలని.. తద్వారా దేశం కూడా అభివృద్ధి చెందుతుందని మోదీ పేర్కొన్నారు. ఏ అభివృద్ధి పని కోసమైనా నేరుగా పీఎంఓను సంప్రదించవచ్చని సూచించారు. ప్రజలు, యువతకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. వారి కోసం పని చేయాలని తెలిపారు. పార్లమెంట్ను ‘ప్రజాస్వామ్యానికి సర్వోన్నత దేవాలయం’గా అభివర్ణించారు. దాని చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. లోక్సభ చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని.. ప్రతిపక్ష సభ్యులతో సత్సంబంధాలు కొనసాగించాలని పేర్కొన్నారు.
అమ్మ ఎలా ఉన్నారు..? : ఎంపీలు అందరినీ వ్యక్తిగతంగా పలకరించిన ప్రధాని.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ క్షేమ సమాచారం గురించి ఎంపీ పార్థ్ పవార్ (ఆమె కొడుకు)ను అడిగి తెలుసుకున్నారు. అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. పార్థ్ పవార్ తండ్రి.. మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ ఏడాది జనవరిలో విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దాంతో ఆ స్థానంలో ఆయన సతీమణి సునేత్రా పవార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
============================

