నర్సంపేట,అర్జున్ సమాచారం:
నల్లబెల్లిలో జరిగిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు తదితరులు పాల్గోన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి తో నాకు రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం ఉంది. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆయనతో కలిసి అనేక పోరాటాల్లో, ఉద్యమాల్లో, ఉపఎన్నికల్లో నేను పనిచేశానని అన్నారు.
తెలంగాణ కోసం ప్రాణాలు, ఆస్తులు, పదవులు ఏవీ లెక్కచేయకుండా పోరాడిన నిస్వార్థ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. మానుకోట సంఘటన అయినా, పరకాల, స్టేషన్ ఘనపూర్ ఉపఎన్నికలైనా.. ప్రతి చోటా పెద్ది సుదర్శన్ రెడ్డి పోరాట స్ఫూర్తి, ఆయన కష్టం ముందుండేది. సమైక్యవాదులు తెలంగాణ గడ్డ మీద అడుగుపెడుతుంటే.. వారి బుల్లెట్లను, రాళ్లను సైతం లెక్కచేయకుండా ముందుండి అడ్డుకున్న పోరాట యోధుడు పెద్ది. తెలంగాణ వచ్చే వరకు రాష్ట్ర సాధన కోసం పోరాడాడు. రాష్ట్రం వచ్చాక నర్సంపేట అభివృద్ధి కోసం ఎంతో తపన పడ్డాడు. ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ, ఆయన పోరాట స్ఫూర్తిని గుర్తించిన కేసీఆర్ .. క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్గా అవకాశం కల్పించారని అన్నారు.
రామప్ప, పాకాల, లక్నవరం చెరువులకు దేవాదుల నీళ్లను అందించాలని కేసీఆర్ ని కోరి సాధించాడు. ఆయన అభ్యర్థన మేరకే కేసీఆర్ ఆనాడు దేవాదుల నీటిని విడుదల చేశారు. ఆ చెరువులకు దేవాదుల నీళ్లు వస్తున్నాయంటే అది ముమ్మాటికీ పెద్ది సుదర్శన్ రెడ్డి కృషే. తన ప్రాంత రైతులు రెండు పంటలు పండించుకోవాలని రాత్రింబవళ్లు తండ్లాడిండు. కేసీఆర్ ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలకు గోదావరి జలాలను అందించాడు. రాష్ట్రంలో జిల్లా కేంద్రం కాని చోట మెడికల్ కాలేజీ సాధించిన ఏకైక నియోజకవర్గం నర్సంపేట. కేసీఆర్ ఆలోచనతో పాటు, ఈ ప్రాంతం మీద పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉన్న ప్రేమ వల్లే ఇది సాధ్యమైంది. కాకతీయ రెడ్డి రాజులు కట్టిన దేవాలయం కూల్చివేతకు వ్యతిరేకంగా చేసిన నిరసనే నేను, పెద్ది కలిసి చేసిన చివరి కార్యక్రమం. అదే మా ఇద్దరి కలయికలో చివరిది అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టి, పోరాటాల ద్వారా ఎదిగిన నాయకుడు సుదర్శన్ రెడ్డి. ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, సివిల్ సప్లైస్ ఛైర్మన్గా, ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ కుటుంబ సభ్యుడిగా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా, ఎంత మాట్లాడుకున్నా తక్కువే.గతంలో మేమిద్దరం బియ్యాల జనార్దన్ ఇంట్లో కిరాయికి ఉండేవాళ్లం. నేను, పెద్ది దాదాపు నెల, 40 రోజుల పాటు ఆ ఇంట్లో కలిసి ఉన్నాం. పరకాల, ఘనపూర్ ఉపఎన్నికల సమయంలో బాధ్యతలను భుజాన వేసుకుని పార్టీని గెలిపించుకున్నాం. అప్పుడు ఆయనకు అన్నం, నిద్ర, ఆకలి అనేవే ఉండేవి కావు. మాకు తెలంగాణ కావాలి, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకోవాలని ప్రతిక్షణం తపనపడ్డ గొప్ప ఉద్యమకారుడు ఆయన. అలాంటి నాయకుడిని కోల్పోవడం కేవలం నర్సంపేటకు, ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు.. యావత్ తెలంగాణ రాష్ట్రానికి, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. పెద్ది సుదర్శన్ రెడ్డి లేని మీటింగ్లో, అది కూడా నర్సంపేట గడ్డ మీద నేను పాల్గొంటానని ఎప్పుడూ ఊహించలేదు.
ఉద్యమ సమయంలో ఒక అమరవీరుని అంతిమ యాత్రలో పాల్గొంటున్నప్పుడు.. పోలీసులతో జరిగిన తోపులాటలో నేను డీసీఎం పైనుంచి కింద పడిపోయాను. అప్పుడు నన్ను పెద్ది సుదర్శన్ రెడ్డి ఏ ఆసుపత్రిలో అయితే చేర్పించి ప్రాణాలు కాపాడాడో.. అదే ఆసుపత్రిలో ఆయనను నేను చివరిచూపు చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని అన్నారు.
(ఈ విషయాన్ని చెబుతూ హరీశ్ రావు తీవ్ర భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు).
కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను భయపెట్టినా, ప్రలోభపెట్టినా, ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా ఆయన తలొగ్గలేదు. ప్రభుత్వ అక్రమాల మీద అదే పాత ఉద్యమ స్ఫూర్తితో చివరి శ్వాస దాకా కొట్లాడిండు. భౌతికంగా సుదర్శన్ రెడ్డి మన మధ్య లేకపోయినా.. ఆయన చేసిన పోరాటం, ప్రజల కోసం పడ్డ తపన, ఆయన జ్ఞాపకాలు మన గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని అన్నారు.
=======================

