చెన్నూరులో ఘనంగా తిరంగా యాత్ర.రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి – తిరంగా యాత్ర కమిటీ.
చెన్నూరు :ఆగస్టు 10 అర్జున్ సమాచారం:
కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు చెన్నూరు పట్టణంలో తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెన్నూరు పురవీధులు త్రివర్ణ పతాకాల రెపరెపలతో పులకించిపోయేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తిరంగా యాత్ర కమిటీ పిలుపునిచ్చింది.
ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ త్రివర్ణ పతాకాన్ని చేతబూని చెన్నూరు పురవీధుల గుండా “భారత్ మాతా కీ జై” నినాదాలతో యాత్రలో పాల్గొని, పాఠశాల విద్యార్థులకు దేశభక్తి స్ఫూర్తిని కలిగించాలని కమిటీ కోరింది.
ఈ కార్యక్రమానికి సంబంధించి సోమవారం 10-08-2026న సాయంత్రం 4 గంటలకు శ్రీ సరస్వతీ శిశు మందిరం, చెన్నూరులో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని కార్యక్రమ నిర్వహణపై పలు సూచనలు చేశారు.
ప్రముఖుల సూచనల మేరకు 13-08-2026న మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ ప్రతాప్ మారుతి ఆలయం ఆవరణ వద్ద తిరంగా యాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. పాఠశాల యాజమాన్యాల సహకారంతో 8, 9, 10వ తరగతుల విద్యార్థులను పెద్ద సంఖ్యలో తీసుకురావాలని నిర్ణయించారు. అక్కడ విద్యార్థులు, పట్టణ ప్రజలు చేతిలో త్రివర్ణ పతాకాలు పట్టుకుని సామూహికంగా వందేమాతరం ఆలాపన చేయనున్నారు.
ఈ తిరంగా యాత్రలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థి విభాగాలు, రాజకీయ పార్టీలు, వ్యాపార వర్గాలు, కార్మిక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, వాకర్స్ సొసైటీ, న్యాయవాదులు, విశ్రాంత ఉద్యోగులు, ముఖ్యంగా జెన్-జెడ్ యువత, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ కుల సంఘాలు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ శాఖల అధికారులు పాల్గొనాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.
అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తిరంగా యాత్రను విజయవంతం చేస్తే చెన్నూరు పేరు దేశవ్యాప్తంగా మారుమోగేలా కార్యక్రమం నిలుస్తుందని పెద్దలు ఆకాంక్షించారు.
ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు త్రివర్ణ పతాకాలు చేతబూని క్రమశిక్షణతో యాత్రలో పాల్గొనేలా అవగాహన కల్పించేందుకు తిరంగా యాత్ర కమిటీ ప్రతినిధులు ఆయా పాఠశాలలను సందర్శించి యాజమాన్యాలకు వివరించనున్నారు.
– తిరంగా యాత్ర కమిటీ

