ఖమ్మం,అర్జున్ సమాచారం:
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈరోజు ఖమ్మం కలెక్టరేట్లో లబ్ధిదారులకు అత్యున్నత సాంకేతికతతో కూడిన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పంపిణీ చేసారు.
ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజల కోసమే పనిచేస్తున్న మన ప్రజా ప్రభుత్వం, తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో నకిలీలను పూర్తిగా అరికట్టేందుకు ఈ కొత్త స్మార్ట్ కార్డులలో ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్, ప్రత్యేక హోలోగ్రామ్, వాటర్ మార్క్, యూవీ లోగో సహా 9 రకాల పటిష్టమైన భద్రతా ఫీచర్లను పొందుపరిచాం. ఈ-పాస్ యంత్రాలతో బయోమెట్రిక్ విధానాన్ని అనుసంధానించి రేషన్ పంపిణీలో నూరు శాతం పారదర్శకతను తీసుకువస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా 3.42 కోట్ల మందికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నాం. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఈ సరికొత్త డిజిటల్ కార్డులు మంజూరు చేస్తూ, వాటి ద్వారా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాం. పేదలకు మెరుగైన వైద్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా సొంతింటి కల సాకారం, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం వంటి పథకాలతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే మన ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లేలా మన ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు.
============================

