అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 20 | ముత్తారం రిపోర్టర్.
ముత్తారం మండలం దరియాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలకు అరుదైన అవకాశం దక్కింది. భారతదేశవ్యాప్తంగా ఎంపికైన 26 పాఠశాలల్లో ఒకటిగా, తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకైక పాఠశాలగా ప్రతిష్టాత్మక బోయింగ్ సుకన్య స్టెమ్ ల్యాబ్ ఏర్పాటుకు దరియాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్ ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేసరి సంతోష్ కుమార్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కేసరి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రధానాచార్యుడిగా ఈ అవకాశం లభించడం ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందన్నారు. ఈ ఎంపిక విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది సమష్టి కృషికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నామని తెలిపారు.
బోయింగ్ సుకన్య స్టెమ్ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) రంగాల్లో ప్రయోగాత్మకంగా నేర్చుకునే అవకాశం మరింత విస్తృతమవుతుందని అన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. లభించిన ఈ ప్రతిష్టాత్మక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి మరింత కృషి చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం తన వంతు కృషిని ఎల్లప్పుడూ కొనసాగిస్తానని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో భవిష్యత్తులో పాఠశాలకు మరిన్ని మంచి అవకాశాలు, విజయాలు సాధించేలా కృషి చేస్తామని ప్రిన్సిపాల్ డాక్టర్ కేసరి సంతోష్ కుమార్ తెలిపారు.

