ప్రధాని నివాస ముట్టడిని ఖండిస్తూ కమాన్పూర్లో బీజేపీ నిరసన
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 24:
ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించిన కాంగ్రెస్, కూటమి పార్టీల తీరును నిరసిస్తూ శుక్రవారం కమాన్పూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు కొయ్యడ సతీష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మచ్చగిరి రాము పాల్గొని మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి దేశ ప్రజలు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రధాని నివాసాన్ని ముట్టడించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
దేశంలో గతంలో అనేక మంది ప్రధానులు పాలన చేసినప్పటికీ, వారి నివాసాలను ముట్టడించే పరిస్థితులు తలెత్తలేదని అన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొయ్యడ సతీష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు మచ్చగిరి రాము, సీనియర్ నాయకులు మట్ట శంకర్, జంగపల్లి అజయ్, మండల ప్రధాన కార్యదర్శి పంతకాని విశ్వతేజ, పెద్దపల్లి శ్యాంసుందర్, ఉపాధ్యక్షుడు పిల్లి చంద్రయ్య, సదానందం, కార్యదర్శి అగ్గి శ్రావణ్, సంపత్, శ్రీమన్, భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.

