ఆదివరాహ జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తిప్రారంభమైన జయంతి ఉత్సవాలు
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 23
కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆది వరాహస్వామి జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఆలయ ఈవో కొసన కాంతారెడ్డి తెలిపారు. జయంతి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమై ఈనెల 26వ తేదీ వరకు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయానికి వెళ్లే రహదారికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించినట్లు తెలిపారు.
జయంతి ఉత్సవాల సందర్భంగా ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన, రంగారెడ్డి జిల్లాలో స్థిరపడిన వ్యాపారవేత్త మాదాసు సుజాత–రవీందర్ దంపతులు భక్తులకు మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు విష్ణుసహస్రనామ పారాయణం, 7 గంటలకు అంకురార్పణ, రక్షాబంధనం, మృత్సంగ్రహణం నిర్వహించారు. 24వ తేదీ సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి నిత్యాభిషేకం, గోపూజ, ఉదయం 10 గంటలకు ఆదివరాహ హవనం, సాయంత్రం విష్ణుసహస్రనామ పారాయణం, నిత్యపూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
25వ తేదీ మంగళవారం ఉదయం నిత్యాభిషేకం, గోపూజ అనంతరం ఉదయం 10 గంటలకు ఆదివరాహస్వామి కళ్యాణ మహోత్సవం, మధ్యాహ్నం నిత్యపూర్ణాహుతి నిర్వహించనున్నారు. 26వ తేదీ బుధవారం జయంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు 108 కలశములతో అష్టోత్తర శతఘటాభిషేక మహోత్సవం, ఉదయం 11.30 గంటలకు సత్యపూర్ణాహుతి నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారికి భక్తులు సమర్పించిన రజత కవచధారణ, మహాప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
జయంతి ఉత్సవాలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఇతర మంత్రులు, జిల్లా అధికారులు, మండల అధికారులు హాజరుకానున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

