కల్లు రూపా రెడ్డి హత్యకు నిరసనగా ఆసిఫాబాద్లో భారీ ఆందోళన
అర్జున్ సమాచారం ఆగస్టు 21 జిల్లా ప్రతినిధి (కొమరం భీం)
ఆసిఫాబాద్: కల్లు రూపా రెడ్డి హత్య ఘటనను నిరసిస్తూ కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం (టిఆర్ఎస్ ఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలలకు చెందిన మహిళా సిబ్బంది, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కల్లు రూపా రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలు నిరసన వ్యక్తం చేస్తూ, ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రూపా రెడ్డి హత్యకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మహిళలపై హింస, దాడులు, హత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మహిళలకు పూర్తి భద్రత కల్పించడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు కోరారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ ఎంఏ ప్రతినిధులు, ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమం శాంతియుతంగా కొనసాగింది.

