పిడిఎస్ బియ్యం పట్టివేత – ఇద్దరిపై కేసు నమోదు
భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 06 :
పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) బియ్యం భారీగా పట్టుబడింది. ఆదివారం (సెప్టెంబరు 6, 2026) భీమారం గ్రామ శివార్లలోని జోడువాగు వద్ద తనిఖీలు చేపట్టగా ఈ అక్రమ రవాణా వెలుగుచూసింది.
TS-19-TA-4511, TS-10-UC-7848 రిజిస్ట్రేషన్ నంబర్లు గల రెండు బొలెరో పికప్ వాహనాల్లో తరలిస్తున్న సుమారు 70 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యం విలువ దాదాపు ₹1.40 లక్షలు కాగా, వాహనాల విలువ ₹4 లక్షలుగా అంచనా వేశారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు ₹5.40 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై డిప్యూటీ తహసీల్దార్ చల్ల స్రవంతి ఫిర్యాదు చేయడంతో, భీమారం ఎస్సై ఏ . రాజేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నిందితులు తాళ్లపెల్లి గోపాల్, పస్తం సమ్మయ్యలను అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారు.
రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసినా, నిల్వ చేసినా లేదా రవాణా చేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని భీమారం పోలీసులు హెచ్చరించారు.

