ఉపాధ్యాయ హక్కుల సాధనకు సంఘటితంగా ముందుకు రావాలి.
అర్జున్ సమాచారం జులై 27 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి:
తాండూరు మండలం రేచిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు భట్టారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంలో సభ్యత్వం స్వీకరించారు.
ఈ సందర్భంగా భట్టారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గత ఎనిమిది దశాబ్దాలుగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తూ వస్తోందని తెలిపారు. ఉపాధ్యాయులందరూ సంఘంలో సభ్యత్వం తీసుకుని సంఘాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
జిల్లాలోని కొన్ని మండలాల్లో గత సంవత్సరం వేసవికాలంలో నిర్వహించిన ఉపాధ్యాయ శిక్షణలకు సంబంధించిన సంపాదిత సెలవులను ఇప్పటికీ మంజూరు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సంబంధిత మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు వెంటనే చర్యలు తీసుకుని ఆ సెలవులను మంజూరు చేయాలని కోరారు.
ప్రభుత్వం పెండింగ్లో ఉన్న కరువు భత్య బకాయిలను తక్షణమే విడుదల చేయడంతో పాటు వేతన సవరణ సంఘం నివేదికను స్వీకరించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే భవిష్య నిధి, నూతన పెన్షన్ విధానం, సంపాదిత సెలవులు తదితర బిల్లులను వెంటనే విడుదల చేయాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
కార్యక్రమంలో రవిబాబు, కృష్ణ గౌడ్, రాజేంద్రప్రసాద్, సంతోష్, శ్రీనివాస్, మధుకర్, శ్రీలత, సుకుమాంజలి తదితరులు పాల్గొన్నారు.

