నరసరావుపేట,అర్జున్ సమాచారం:
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండల పరిధిలోని కండ్రిగ, గుట్టపల్లి, గంగుపల్లి గ్రామాలకు తక్షణమే తాగునీరు, సాగునీరు కల్పించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో పల్నాడు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయా గ్రామాల ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నా ప్రజలకు కనీస తాగునీటి సదుపాయం కూడా కల్పించలేకపోవడం పాలకుల వైఫల్యమని విమర్శించారు. గ్రామాల్లో ప్రజలతో పాటు పశువులకు కూడా తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.
“పెద్ద పెద్ద పట్టణాలు నిర్మించామని, భారీ భవనాలు కట్టామని ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గ్రామీణ ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించలేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందో చెప్పాలి” అని ప్రశ్నించారు. ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిధిలోనే ఈ గ్రామాలు ఉన్నప్పటికీ త్రాగునీటి సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదని నిలదీశారు.
కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న కూటమి ప్రభుత్వం పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. పాలకులు పేద వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని, ఎన్నికలు ముగిసిన తర్వాత వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
దళితులు, గిరిజనులు అధికంగా నివసించే గ్రామాల పట్ల కూటమి ప్రభుత్వం చిన్నచూపు ప్రదర్శిస్తోందని ఆరోపించారు. అధికారులు వెంటనే బొల్లాపల్లి మండలంలోని కండ్రిగ, గుట్టపల్లి, గంగుపల్లి గ్రామాలను సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి తాగునీరు, సాగునీటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, పల్నాడు జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శులు షేక్ హుస్సేన్, కాసా రాంబాబు, వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బుదాల శ్రీనివాసరావు, వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ సుభాని, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణం, నాయకులు చెరుకుపల్లి నిర్మల, అప్పరాజు పవన్, మల్లికార్జున్, వందనం, రంగయ్య , సైదాతదితరులు పాల్గొన్నారు.
=============================
దళితులు, గిరిజనులు అంటే కూటమి ప్రభుత్వానికి చిన్నచూపా…? పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిధిలో ఈ గ్రామాలు ఉన్నప్పటికీ త్రాగునీటి సమస్య ఎందుకు పరిష్కరించరు…? బొల్లాపల్లి మండలంలోని గ్రామాలను అధికారులు వెంటనే సందర్శించాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
RELATED ARTICLES
