జయశంకర్ భూపాలపల్లి,అర్జున్ సమాచారం:
ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డివార్మింగ్ డే ముందస్తు ఏర్పాట్లపై విద్యా, వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1 నుండి 19 ఏళ్ల వయస్సు గల 70,700 మంది పిల్లలను ఈ కార్యక్రమం కోసం గుర్తించడం జరిగిందని తెలిపారు. విద్యా, వైద్య, మున్సిపల్, పంచాయతీ రాజ్ మరియు అంగన్వాడీ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, 1-19 సంవత్సరాలున్న ఏ ఒక్కరు మిగిలిపోకుండా వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఈ మాత్రలు తీసుకోవడం వల్ల పిల్లల్లో నట్టల నివారణ ద్వారా రక్తహీనత తగ్గి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారని, ఈ కార్యక్రమంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. మాత్రలు తీసుకోవడం వల్ల ఎదుగుదల బావుంటుందని, అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్ వాడి కేంద్రాల్లో అవగహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంపై పంచాయతీలు, మున్సిపాలిటీలో టామ్ టామ్ ద్వారా విస్తృతంగా అవగహన కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా మధు సూదన్, డిఆర్వో వసంత కుమారి, డీఈఓ రాజేందర్, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, మున్సిపల్, పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
=========================
13నుంచి ఆల్బండజోల్ మాత్రలు పంపిణి.
RELATED ARTICLES
