హైదరాబాద్, అర్జున్ సమాచారం :
తెలంగాణపై బీజేపీ సీరియస్గానే ఉన్నది అధికారం దక్కించుకోవడమే కేంద్రంగా ఏమి చేయాలో అన్నీ చేయడానికి సిద్దపడింది. సేమ్ చంద్రబాబు తరహాలో అవును..చంద్రబాబు కూడా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినవారు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు..ఏటికి ఎదురీదుతున్నప్పుడు, ఎవరితోనైనా చేతులు కలుపుతాడు అంతిమ లక్ష్యం అధికారం చేజిక్కించుకోవడం.
ఇప్పుడు మోడీ, అమిత్ షాల ద్వయం తెలంగాణను తమ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతున్నది. వ్యూహాలకు మరింతగా పదును పెడుతున్నది. మరో రెండు, మూడు రోజుల్లో కేంద్రం చేపట్టబోయే కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో తెలంగాణకు రెండు మంత్రి పదవులు దక్కనున్నాయి.
ఒక్కటి ఇస్తే అదే పదివేలు అనుకుంటున్నారంతా అలాంటిది రెండు ఇవ్వాలనే కచ్చితమైన నిర్ణయానికి వచ్చినట్టుగా ఢిల్లీ పెద్దలు చర్చించుకుంటున్నారు. ఇందులోనూ సామాజిక సమీకరణలకు పెద్దపీట వేయనున్నారు. డీకే అరుణ, ఈటల రాజేందర్లకు దాదాపుగా కేబినెట్లో బెర్త్ ఖరారైందని తెలుస్తోంది. మొదటి నుంచి వీరిద్దరి పేర్లు ప్రధానంగా చర్చలో ఉన్నాయి. కానీ ఇద్దరికీ ఇవ్వడం కష్టమేననే భావన అందరిలో ఉంది.
ఇప్పటికే బండి సంజయ్, కిషన్రెడ్డిలకు మంత్రి పదవులున్నాయి. మరో ఇద్దరికి ఇవ్వకున్నా,ఈటల రాజేందర్కు వస్తుందనే ప్రచారం ఉండే. ఆయన బీఆరెస్ పార్టీని వీడిన తరువాత అమిత్ షా అభయం మేరకే బీజేపీలో చేరారు. మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఆయనకు అపార అనుభవం ఉంది. బీసీ ముదిరాజ్ కులానికి చెందిన ఈటల రాజేందర్కు మాస్ లీడర్గా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సతీమణి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ వర్గం నుంచి కూడా ఈటల రాజేందర్కు బలమైన మద్దతు లభిస్తోంది.
ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్కు మంత్రి పదవి ఇస్తే పార్టీని మరింత బలోపేతం దిశగా తీసుకెళ్తాడని, బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడం పక్కా అనే సమాచారం కేంద్రానికి ఎప్పటికప్పుడు చేరవేస్తూనే ఉన్నారు. మోడీ, అమిత్ షాలు కూడా ఈటలకు ప్రామిస్ చేసి ఉన్న నేపథ్యంలో సమయం కోసం చూస్తున్నారు.
ఇప్పటికే ఆయన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేయాలనే ఆలోచన చేసింది అధిష్టానం. కానీ ఇక్కడ కిషన్రెడ్డి అడ్డు తగిలాడు. మధ్యే మార్గంగా రాంచంద్రారావును తీసుకొచ్చి, ఆయనకు అధ్యక్ష పగ్గాలు అందించారు. అప్పట్నంచి పూర్తిగా డిసాప్పాయింటెడ్గానే ఉన్నాడు ఈటల. తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నాడు. ఎక్కడా వివాదాలు లేవు. పెద్దగా వార్తల్లో లేడు.తన అనుచరగణాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. పార్టీలో కూడా క్రియాశీలకంగా కనిపించడం లేదు.
ఇక్కడి నేతలపై అలకపాన్పెక్కిన ఈటలకు మంత్రి పదవి ఇవ్వడం మూలంగా ఆయన నాయకత్వానికి, పార్టీకి కూడా బూస్టింగ్ ఇచ్చినట్టవుతుందని భావిస్తోంది అధిష్టానం. ఇక డీకే అరుణకు ఇవ్వడం ద్వారా రెడ్డి సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకుని పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచన ఉంది. డీకే అరుణ మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఉన్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యాక్షురాలిగా కూడా సేవలందిస్తున్నారు

