ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చిన భార్య
ఉరివేసి చంపి గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం
నిజామాబాద్, అర్జున్ సమాచారం, జూలై 01
నిజామాబాద్ లో దారుణం వెలుగు చూసింది. . ప్రియుడితో కలిసి భార్య, భర్తకు ఉరివేసి కడతేర్చింది. ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, భార్యకు ఉన్న అక్రమ సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. భర్తను హత్య చేసిన అనంతరం గుండెపోటుతో మరణించినట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే మృతుడి మెడపై గాయాల ఆనవాళ్లు గమనించిన గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. అనంతరం మృతుడి భార్యతో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నివేదికతో పాటు విచారణలో లభించే ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

