పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి అనే విధంగా తెలంగాణలో అవినీతి అధికారుల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఏసీబీ దాడులు ఎలాంటి ఆటంకాలు
లేకుండా అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఇన్నాళ్లుగా చిన్న స్థాయి అధికారుల మీద పడ్డ శాఖ ఇప్పుడు పెద్ద తలకాయల మీద దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసీబీకి పూర్తి స్థాయి స్వేచ్ఛ
ఇవ్వడంతో అధికారులు ఎవరిని వదిలిపెట్టకుండా దూకుడు ప్రదర్శిస్తున్నారు. కేవలం సాధారణ తనిఖీలు కాకుండా పక్కా సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తూ అక్రమార్కుల గుండెల్లో గుబులు
పుట్టిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో వేళ్లూనుకున్న లంచావతారాలను పట్టుకోవడానికి ఏకంగా ఒక పెద్ద వ్యూహాత్మక ఆపరేషన్ను ప్రారంభించారు.అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇప్పటివరకు ప్రధానంగా
రెవెన్యూ, నీటిపారుదల, అటవీ, ఎలక్ట్రిసిటీ, మున్సిపల్, పోలీస్ శాఖల మీదనే ప్రధానంగా దృష్టి సారించారు. ఈ దాడులలో పట్టుబడిన వారిలో ఎక్కువగా గ్రూప్ వన్, గ్రూప్ టూ కేడర్కు చెందిన అధికారులే
ఉన్నారు. అయితే ఇప్పుడు క్షేత్రస్థాయి అధికారులతో పాటు ఏకంగా ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల అవినీతి బాగోతం మీద కూడా ఏసీబీ దృష్టి సారించినట్లు స్పష్టమైన సమాచారం వస్తోంది. ఇటీవల పోలీస్
కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంగిరెడ్డి భీమిరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. సరిగ్గా 2019 నాటి పాత కేసను మళ్లీ తవ్వి తీసిన పోలీసులు అతని అక్రమ సామ్రాజ్యాన్ని
మొత్తం బట్టబయలు చేశారు. కేవలం ఒక డీఎస్పీ స్థాయి అధికారి ఏకంగా నూట యాభై కోట్ల రూపాయలకు పైగా అక్రమ ఆస్తులను కూడబెట్టడం అందరినీ విస్మయానికి గురిచేసింది.ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో
పనిచేసిన ఒక ఏఈ స్థాయి అధికారి కూడా నూట యాభై కోట్ల రూపాయలకు పైగా అక్రమ ఆస్తులతో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. అయితే వీరంతా కూడా కేవలం బినామీలు మాత్రమేనని, అసలు
సూత్రధారులు, పాత్రధారులు తెరవెనుక వేరే ఉన్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కొంతకాలంగా కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరు తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. వారంతా
నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఆస్తులు సంపాదించారనే పక్కా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు సమగ్రమైన వివరాలు సేకరించి రంగంలోకి దిగారు. అక్రమంగా సంపాదించిన
అధికారుల చిట్టా మొత్తం సిద్ధం చేసుకున్న అధికారులు త్వరలోనే వారిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలు రాష్ట్ర బ్యూరోక్రసీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.తెలంగాణ అవినీతి
నిరోధక శాఖ దాడుల వెనుక సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తిరుగులేకుండా చెలామణి అయిన కొందరు ఉన్నతాధికారులు ఇప్పుడు ఏసీబీ నిఘా
నీడలో భయంతో వణికిపోతున్నారు. పదేళ్ల కాలంలో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోచుకున్న నాయకులకు కొమ్ముకాసిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు ఏసీబీ ఉచ్చులో చిక్కుకోవడం
ఖాయంగా కనిపిస్తోంది. పాముల వేట ముగిసి ఇప్పుడు అసలైన అనకొండల గుట్టు రట్టవుతుండటంతో రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. కేవలం నోటీసులు ఇవ్వడమే కాకుండా వేల కోట్ల
విలువైన బినామీ ఆస్తులను జప్తు చేసే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ దాడులతో కింది స్థాయి ఉద్యోగులు సైతం లంచాలు తీసుకోవడానికి భయపడేలా అధికార యంత్రాంగంలో ఒక సరికొత్త
భయం, స్పష్టమైన మార్పు స్పష్టంగా కనిపిస్తున్నాయి
=========================

