ఆదివరాహస్వామి జయంతోత్సవాలను విజయవంతం చేయండి ఈనెల 23 నుంచి 26 వరకు వైభవంగా ఉత్సవాలు.. 25న స్వామివారి కల్యాణ మహోత్సవం.
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 08
కమాన్పూర్ మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ ఆదివరాహస్వామి క్షేత్రంలో ఈనెల 23 నుంచి 26 వరకు నిర్వహించనున్న జయంతోత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్, కార్యనిర్వహణ అధికారి కాంతారెడ్డి, ప్రధాన అర్చకులు వరప్రసాదాచార్యులు కోరారు. శనివారం ఆలయ ప్రాంగణంలో జయంతోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు రోజులపాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, కల్యాణోత్సవం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 23న విష్ణుసహస్రనామ పారాయణం, అంకురార్పణ, రక్షాబంధనం, మృత్సంగ్రహణం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 24న నిత్యాభిషేకం, గోపూజ, ఆదివరాహ హోమం చేపట్టనున్నట్లు తెలిపారు. 25న స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 26న జయంతి సందర్భంగా అష్టోత్తర శతనామావళి, 108 కలశాలతో అభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణతోపాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని, జయంతోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు పాల్గొన్నారు.

