400 మీటర్ల పరుగు పందెంలో ఆనందికి స్వర్ణ పతకజాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన కమాన్పూర్ క్రీడాకారిణి నల్లవెల్లి ఆనంది.
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 08
కమాన్పూర్ మండలంలోని గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నల్లవెల్లి ఆనంది జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. హనుమకొండలోని జేఎన్ఎం స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఐదో తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆనంది ప్రతిభ చాటింది. 18 సంవత్సరాల విభాగంలో నిర్వహించిన 400 మీటర్ల పరుగు పందెంలో 56 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణ పతకం సాధించింది.
ఈ విజయంతో ఆనంది 21వ జాతీయ యువ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైంది. పంజాబ్లో నిర్వహించనున్న జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనుంది. కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి భారతి–శంకర్ దంపతుల రెండో కుమార్తె అయిన ఆనంది గతంలోనూ జాతీయ, రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించింది. తాజాగా రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించి మరోసారి తన ప్రతిభను చాటుకుంది.
ఆనంది జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో కమాన్పూర్ మండల ప్రజలు, కళాశాల అధ్యాపకులు, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయస్థాయిలోనూ అద్భుత ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్రానికి, కమాన్పూర్ మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు.

