ఓటరు జాబితా సవరణపై అవగాహన.
అర్జున్ సమాచారం – ఆగస్టు 27 / ముత్తారం రిపోర్టర్.
ముత్తారం మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించి ఓటరు జాబితా సవరణ, ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రామసభల్లో గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలతో పాటు ఓటరు జాబితాపై ప్రత్యేకంగా చర్చించారు.
ఎస్ఐఆర్ కార్యక్రమం అనంతరం ప్రకటించిన ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. ఓటరు జాబితాలో పేరు నమోదు కాని అర్హులైన వారు సంబంధిత బీఎల్ఓలను (BLO) సంప్రదించి మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
అదేవిధంగా జాబితాలో పేరు ఉన్నప్పటికీ పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు బీఎల్ఓలను సంప్రదించాలని సూచించారు. ఓటరు జాబితాలో అనర్హుల పేర్లు, మరణించిన వ్యక్తుల పేర్లు లేదా ఇతర కారణాలతో తొలగించాల్సిన పేర్లు ఉన్నట్లయితే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రజలు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలు భాగస్వాములై తమ ఓటు హక్కుకు సంబంధించిన వివరాలను సక్రమంగా పరిశీలించుకోవాలని గ్రామసభల్లో వివరించారు.
ఆసరా పింఛన్లపై అవగాహన
గ్రామసభల్లో ఆసరా పింఛన్లకు సంబంధించిన అంశాలపై కూడా ప్రజలకు సమాచారం అందించారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆసరా పింఛన్ పొందని వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం అవసరమైన పత్రాలు, వ్యక్తిగత వివరాలతో సంబంధిత గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ పథకాలు, ఓటరు జాబితా, పింఛన్లు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే గ్రామసభల ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. గ్రామసభల్లో వెల్లడించిన సమాచారాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు, అభ్యర్థనలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రభుత్వ అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

