జయశంకర్ భూపాలపల్లి,అర్జున్ సమాచారం:
మై భారత్ (MY Bharat) ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా “ఖేలో ఇండియా సంవాద్ – ఖేల్ కీ బాత్, ప్రధానమంత్రి కే సాత్” వర్చువల్ కార్యక్రమాన్ని జయశంకర్ భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ప్రసంగాన్ని విద్యార్థినీ విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి రఘు, ఖేలో ఇండియా కోచ్ శ్రీనివాస్, మై భారత్ ప్రోగ్రాం ఆర్గనైజర్ వెల్దండ సురేష్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఏ. రమణ రావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కవిత, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. యువత క్రీడలను తమ జీవితంలో భాగంగా చేసుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఖేలో ఇండియా కార్యక్రమాల ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని క్రీడా రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
=============================

