ప్రతి నెల మూడు మెడికల్ బోర్డులు నిర్వహించాలిదరఖాస్తుదారులందరినీ మెడికల్ ఇన్వ్యాలిడేట్ చేయాలినల్ల బ్యాడ్జీలతో టిబిజికెఎస్ కార్మికుల నిరసన.
అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 1 | రామగుండం ప్రతినిధి.
సింగరేణి సంస్థలో ప్రతి నెల క్రమం తప్పకుండా మూడు మెడికల్ బోర్డులు నిర్వహించి, అనారోగ్యంతో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ మెడికల్ ఇన్వ్యాలిడేట్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు ఈ నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆర్జీ-3 ఏరియాలోని ఎస్అండ్పీసీ విభాగం సెక్యూరిటీ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
టిబిజికెఎస్ కేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈసంపల్లి రమేష్ మాట్లాడుతూ.. సింగరేణిలో రద్దు చేసిన డిపెండెంట్ ఉద్యోగాల స్థానంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కారుణ్య నియామకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ విధానం ద్వారా 13 వేల మందికి పైగా కార్మికులను మెడికల్ ఇన్వ్యాలిడేట్ చేయడం జరిగిందని, దీంతో ఉద్యోగం కోరుకున్న వేలాది కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 70 శాతం మంది మాత్రమే మెడికల్ అన్ఫిట్ అవుతున్నారని అప్పట్లో కాంగ్రెస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు విమర్శలు చేశాయని అన్నారు. ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే దరఖాస్తు చేసుకున్న కార్మికులను 100 శాతం మెడికల్ అన్ఫిట్ చేయిస్తామని, ప్రతి నెల కనీసం మూడు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని హామీలు ఇచ్చారని గుర్తుచేశారు.
అయితే ప్రస్తుతం ఆచరణలో 10 శాతానికి మించి మెడికల్ అన్ఫిట్ జరగడం లేదని ఆరోపించారు. మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తుండగానే పలువురు కార్మికుల సర్వీసు కాలం పూర్తవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న కార్మికుల కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి నెల నిరంతరాయంగా మూడు మెడికల్ బోర్డులు నిర్వహించాలని, అనారోగ్యంతో బాధపడుతున్న అర్హులైన కార్మికులందరినీ మెడికల్ ఇన్వ్యాలిడేట్ చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం జమేదార్ పిల్లి కుమారస్వామికి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో టిబిజికెఎస్ బ్రాంచ్ సెక్రటరీ పొన్నం సదానందం, షిఫ్ట్ ఇన్చార్జ్ పలిగిరి హరికిరణ్, సీనియర్ నాయకులు రమణరెడ్డి, గుడిసెల రాజశేఖర్, మామిడాల లక్ష్మీరాజం, అజ్మీరా రాజేశం, రామగిరి శ్రీనివాస్, సంజీవరావు, ముజఫర్ ఖాన్, గొట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

