కొండా సురేఖ బర్తరఫ్ను ఖండిస్తూ కళ్లకు గంతలతో బీసీల నిరసన..
అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 04. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల, సెప్టెంబర్ 4:రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడాన్ని ఖండిస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకోని కాంగ్రెస్ అధిష్ఠానం, బీసీ బిడ్డ కొండా సురేఖకు సంబంధం లేని తన బిడ్డ వ్యాఖ్యల విషయంలో ఆమెపై చర్యలు తీసుకోవడం అన్యాయమని ఆరోపించారు. రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్న బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
సామాజిక న్యాయం సాధిస్తామని, బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం బీసీ సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖపై తీసుకున్న బర్తరఫ్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు.
లేని పక్షంలో కొండా సురేఖకు బాసటగా నిలుస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు బీసీలు, బీసీ సంఘాలు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, కర్రే లచ్చన్న న్యాయవాది, రాష్ట్ర బీసీ సంఘాల నాయకులు, పద్మశాలి సంఘం నాయకుడు గజెల్లి వెంకటయ్య, తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మాచర్ల సదానందం, నాయకులు శాఖపురి భీమ్సేన్, వేముల అశోక్, వేముల కిరణ్, చంద్రగిరి చంద్రమౌళి, ఎండి లతీఫ్, సురేంద్ర చారి, చెలిమెల అంజయ్య, గగ్గూరి రాజన్న తదితరులు పాల్గొన్నారు.

