ఆపరేటర్ లేక నిలిచిపోయిన భూభారతి సేవలు!భీమారం తహశీల్దార్ కార్యాలయంలో 20 రోజులుగా భూముల రిజిస్ట్రేషన్లు బంద్..కొనుగోలుదారులు, విక్రయదారుల అవస్థలు.
భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 19:
భీమారం మండల తహశీల్దార్ కార్యాలయంలో భూభారతి ఆపరేటర్ లేకపోవడంతో గత 20 రోజులుగా భూముల కొనుగోలు, అమ్మకాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. భూభారతి ఆపరేటర్ అందుబాటులో లేకపోవడంతో స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పటికీ రిజిస్ట్రేషన్లు పూర్తికాకపోవడంతో భూముల కొనుగోలుదారులు, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతంలో పనిచేసిన కాంట్రాక్ట్ ఆపరేటర్లను తొలగించి, జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి శాశ్వత ప్రాతిపదికన భూభారతి ఆపరేటర్లుగా నియమించినట్లు తెలిసింది. ఈ క్రమంలో భీమారం మండలానికి నియమితులైన మంచిర్యాల ఆర్డిఓ ఆఫీసు లో పనిచేసిన ఆపరేటర్ ని భీమారం కి అటాచ్ చేశారు. అయినప్పటికి ఇక్కడి భూభారతి ఆపరేటర్ కొన్ని రోజుల పాటు విధులు నిర్వహించి, ఆకస్మాత్తుగా విధులకు దూరమయ్యారు. దీంతో మండలంలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.
ఇప్పటికే రిజిస్ట్రేషన్ కోసం స్లాట్లు బుక్ చేసుకున్న పలువురు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్లు ఎప్పుడు పూర్తవుతాయో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన పనులు నిలిచిపోవడంతో కొనుగోలుదారులు, విక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు.
భీమారం మండలంలో నిలిచిపోయిన భూభారతి సేవలను వెంటనే పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి తహశీల్దార్ కార్యాలయంలో శాశ్వత భూభారతి ఆపరేటర్ను త్వరితగతిన నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లను త్వరగా పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.

