ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్చంద్రుడిపై శాశ్వత అడుగులు.

చంద్రుడిపై శాశ్వత అడుగులు.

📰 Generate e-Paper Clip

చంద్రుడిపై శాశ్వత అడుగులు.

విజయవాడ, ఆగస్టు 18 (అర్జున్ సమాచారం ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ ఆగస్టు 18,)

చంద్రుడిపై మనిషి ఎక్కువకాలం నివసించగలడా? అక్కడే ఉండి పరిశోధనలు చేయడం, అవసరమైన వనరులను వినియోగించుకోవడం సాధ్యమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ అమెరికా అంతరిక్ష సంస్థ కీలక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో దశలవారీగా  ఏర్పాటు చేసి, భవిష్యత్‌లో అక్కడ దీర్ఘకాలిక మానవ ఉనికికి పునాది వేయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. నాసా ప్రస్తుత ప్రణాళిక ప్రకారం 2029-32 మధ్య ప్రారంభ నివాస సదుపాయాలను ఏర్పాటు చేసి, 2032 తర్వాత చంద్రుడిపై నిరంతర మానవ కార్యకలాపాలను విస్తరించనుంది చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేయడం అంత సులభమైన విషయం కాదు. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, రేడియేషన్, చంద్ర రాత్రుల్లో విద్యుత్ కొరత, భూమి నుంచి దూరం వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే రోవర్లు, ల్యాండర్లు, డ్రోన్లు, విద్యుత్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, నివాస మాడ్యూళ్లను దశలవారీగా చంద్రుడిపైకి పంపి వాటి పనితీరును పరీక్షించాలని నాసా భావిస్తోంది.మూన్ బేస్‌కు చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం అక్కడి ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు. శాశ్వతంగా నీడలో ఉండే కొన్ని ప్రాంతాల్లో నీటి మంచు ఉండే అవకాశం ఉంది. నీటిని భవిష్యత్‌లో తాగునీరు, ఆక్సిజన్, హైడ్రోజన్ వంటి వనరుల కోసం ఉపయోగించగలిగితే చంద్రుడిపై దీర్ఘకాలిక మానవ నివాసానికి అది కీలకంగా మారుతుంది.ఇక్కడే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పరిశోధనలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. చంద్రయాన్-2లోని పరికరం చంద్రుడి ధ్రువ ప్రాంతాలను రాడార్ ద్వారా అధ్యయనం చేసింది. 2026లో ఇస్రో వెల్లడించిన తాజా పరిశోధన ప్రకారం.. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని కొన్ని శాశ్వత నీడ ప్రాంతాల్లోని నాలుగు క్రేటర్ల అడుగుభాగాల్లో ఉపరితలానికి దిగువన నీటి మంచు ఉండే అవకాశాన్ని రాడార్ పరిశీలనలు సూచించాయి. చంద్రయాన్-2 డేటా ఆధారంగా ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో నీటి మంచు, ఉపరితల స్వభావం, ఇతర భౌతిక లక్షణాలకు సంబంధించిన కీలక డేటాను రూపొందించారు. భవిష్యత్‌ చంద్ర మిషన్ల ల్యాండింగ్ ప్రాంతాల ఎంపికకు ఈ సమాచారం ఉపయోగపడే అవకాశం ఉంది.నాసా ప్రణాళిక ప్రకారం తొలి దశలో రోవర్లు, ల్యాండర్లు, ఇతర రోబోటిక్ వ్యవస్థలు చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని పరిశీలిస్తాయి. అనంతరం 2029 నుంచి సెమీ-పర్మినెంట్ మౌలిక సదుపాయాలు, విద్యుత్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, నివాస సదుపాయాల ఏర్పాటు ప్రారంభమవుతుంది. ఈ దశలో భారీ మొత్తంలో కార్గోను చంద్రుడిపైకి పంపేందుకు అనేక ల్యాండర్ మిషన్లను ఉపయోగించనున్నారు2032 తర్వాతి దశలో మాత్రం లక్ష్యం మరింత పెద్దది. వ్యోమగాములు చంద్రుడిపై ఎక్కువకాలం నివసించి పనిచేసేలా సెమీ-పర్మినెంట్ హ్యాబిటేషన్ మాడ్యూళ్లు, దీర్ఘకాలిక విద్యుత్ వ్యవస్థలు, ప్రెషరైజ్డ్ రోవర్లు, నిరంతర సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నాసా భావిస్తోంది. ఈ మూన్ బేస్ భవిష్యత్‌లో అంగారకుడి వంటి సుదూర గ్రహాల మిషన్లకు శిక్షణ, పరిశోధన, సాంకేతిక పరీక్షల కేంద్రంగా ఉపయోగపడే అవకాశం ఉంది.అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ప్రస్తుతం నాసా అధికారిక ప్రణాళికలో 2027లో ఆర్టెమిస్-3 ద్వారా నేరుగా చంద్రుడిపై మానవులు దిగడం కాకుండా, ఆ మిషన్‌ను భూమి కక్ష్యలో కీలక వ్యవస్థల పరీక్షలకు ఉపయోగించనున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి తొలి ప్రణాళికాబద్ధమైన మానవ ల్యాండింగ్ ఆర్టెమిస్-4తో 2028లో జరగనుంది.చంద్రుడిపై మానవాళి దీర్ఘకాలిక ఉనికికి అడుగులు పడుతున్న వేళ.. ఇస్రో అందిస్తున్న చంద్ర ధ్రువ ప్రాంత డేటా, నీటి మంచిపై పరిశోధనలు, భవిష్యత్ చంద్ర మిషన్లకు భారత్‌ కీలక భాగస్వామిగా నిలిచే అవకాశాన్ని పెంచుతున్నాయి. చంద్రుడిపై మొదలయ్యే ఈ కొత్త అధ్యాయం.. చివరికి అంగారకుడిపై మనిషి అడుగుపెట్టే ప్రయాణానికి మరో పెద్ద మెట్టుగా మారనుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!