అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, ఆగస్టు 18:
అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడానికి చివరి శ్వాస వరకు పోరాడిన విప్లవ తేజం, బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా మొఘల్ దురాగతాలను నిలదీసి గోల్కొండ కోటపై బహుజన జెండాను ఎగురవేసిన గెరిల్లా పోరాట యోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు భీమారంలో మండల కేంద్రం లో ఘనంగా నిర్వహించారు.
భీమారం గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, సంఘ నాయకులు కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.
బహుజనుల ఆత్మగౌరవ పరిరక్షణకు, సామాజిక న్యాయ సాధనకు పాపన్న గౌడ్ చూపిన పోరాటబాట నేటి తరానికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. రాజ్యమేలే హక్కు ఒక్క వర్గానికే కాదని, సమస్త బహుజనులకు ఉందని నిరూపించిన మహనీయుడు పాపన్న గౌడ్ అని గౌడ సంఘం నాయకులు కొనియాడారు.
రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగిన ఈ కార్యక్రమంలో మండల స్థాయి రాజకీయ నాయకులు, గౌడ సంఘ ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు

