ప్రమాదాలకు నిలయంగా మామిడిగట్టు–ఆదిల్ పేట్ రహదారి
అర్జున్ సమాచారం చెన్నూరు నియోజకవర్గం ప్రతినిధి. ఆగస్టు,11.
మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామం నుంచి *మందమర్రి వైపు వెళ్లే రహదారిపై డీసీఎం వ్యాన్ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది…
మామిడికాట్టెల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇచ్చే క్రమంలో రహదారి పక్కకు దిగడంతో అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ఘటనతో రహదారి ఇరుకుదనం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
మామిడిగట్టు నుంచి ఆదిల్ పేట్ వరకు ఉన్న రహదారి పలు ప్రాంతాల్లో ఇరుకుగా ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఒక వాహనం తప్పనిసరిగా రహదారి పక్కకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. రహదారి అంచున ఉన్న మట్టి బలహీనంగా ఉండటంతో వాహనాలు రోడ్డు దిగిన సమయంలో మట్టి కుంగిపోతూ ప్రమాదాలకు కారణమవుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎదురుగా వాహనాలు వస్తే తప్పని పరిస్థితి మామిడిగట్టు నుంచి ఆదిల్ పేట్ వరకు రహదారి వెడల్పు తక్కువగా ఉండటంతో ఎదురుగా భారీ వాహనాలు వచ్చినప్పుడు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డీసీఎం వ్యాన్లు, లారీలు వంటి భారీ వాహనాలు ఎదురుగా వచ్చిన సమయంలో రెండు వాహనాలు ఒకేసారి రహదారిపై వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఒక వాహనం రహదారి అంచుకు వెళ్లాల్సి వస్తోంది.అలా రహదారి దిగే సమయంలో రోడ్డు పక్కన ఉన్న మట్టి కుంగిపోవడంతో వాహనాలు అదుపుతప్పి బోల్తా పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
తాజాగా మామిడికాట్టెల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ కూడా ఇదే పరిస్థితిలో బోల్తా పడటంతో వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.రహదారి విస్తరణకు అటవీ శాఖ అనుమతులు అవసరం..
మామిడిగట్టు నుంచి ఆదిల్ పేట్ వరకు రహదారికి ఇరువైపులా అటవీ ప్రాంతం ఉండటంతో రహదారి విస్తరణకు అటవీ శాఖ అనుమతులు అవసరమవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. అటవీ ప్రాంతం కారణంగా రహదారిని వెడల్పు చేసేందుకు అవసరమైన అనుమతులు లభించకపోవడంతో ఇరుకైన రహదారిపైనే ఏళ్లుగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని వారు చెబుతున్నారు. ఈ రహదారి మీదుగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు, వ్యాపారులు, సరుకు రవాణా వాహనాలు నిత్యం ప్రయాణిస్తుంటాయి. రహదారి ఇరుకుగా ఉండటంతో ప్రయాణికులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు.ప్రమాదాలు పెరగకముందే చర్యలు తీసుకోవాలి..
తాజాగా డీసీఎం వ్యాన్ బోల్తా పడిన ఘటనను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు…
రహదారి అంచులను పటిష్టం చేయడంతో పాటు ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు…

