అర్జున్ గుట్ట, ప్రాణహిత నది వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
కోటపల్లి ( మంచిర్యాల) అర్జున్ సమాచారం 29 జూలై .
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, IAS కోటపల్లి మండలంలోని అర్జున్ గుట్ట గ్రామాన్ని, ప్రాణహిత నదీ తీర ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వర్షాల వల్ల వరద ముప్పు ఉన్న ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.
ఈ పర్యటనలో భాగంగా అర్జున్ గుట్ట సమీపంలోని ప్రభుత్వ పాఠశాల భవనాన్ని, పాత ఇండ్లను కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు, గ్రామస్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… వర్షాల దృష్ట్యా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణహిత నది వద్దకు గానీ, లోతట్టు ప్రాంతాలకు గానీ, పొంగిపొర్లుతున్న వాగుల వద్దకు గానీ వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు. ఏవైనా అత్యవసర సమస్యలు ఉంటే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు:
ఈ తనిఖీ కార్యక్రమంలో కోటపల్లి తహసీల్దార్ (MRO), ఎంపీడీవో (MPDO), చెన్నూరు సీఐ (CI), కోటపల్లి ఎస్సై (SI), స్థానిక పోలీస్ సిబ్బంది, SDRF బృందం, రాపన్పల్లి గ్రామ సర్పంచ్ అట్టెల ప్రభాకర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే కోటపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బోయిని నగేష్ దొర మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

