నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాంమదర్ థెరిస్సా పొదుపు సమితిపై ఆరోపణలు సరికావని స్పష్టీకరణ.
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 29.
మదర్ థెరిస్సా పొదుపు సమితిపై నామని హరికృష్ణ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని సమితి లోడీ సంస్థ మంథని డివిజన్ కోఆర్డినేటర్ మేకల మల్లేశం తెలిపారు. శనివారం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమితి నిర్వాహకులు మాట్లాడారు.
మహిళలకు ఆర్థికంగా చేయూత అందించాలనే లక్ష్యంతో 2001 నవంబర్ 1న మదర్ థెరిస్సా పొదుపు సమితిని ప్రారంభించామని మేకల మల్లేశం తెలిపారు. అప్పటి నుంచి సమితి దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతోందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సమితిపై ఆరోపణలు చేస్తూ పత్రికల ద్వారా ప్రచారం చేయడం తమను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. సమితికి సంబంధించిన లెక్కలు, వాస్తవాలు అన్నింటినీ మీడియా ముందు అందుబాటులో ఉంచామని తెలిపారు.
సమితి అధ్యక్షురాలు మాదేశి పద్మ మాట్లాడుతూ 2001లో ప్రారంభమైన సమితి గత 26 సంవత్సరాలుగా మహిళలకు ఆర్థికంగా చేయూత అందిస్తూ కొనసాగుతోందని తెలిపారు. సంస్థకు సంబంధించిన అన్ని లెక్కలు, వివరాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని మీడియా ప్రతినిధుల ముందు ప్రవేశపెట్టామని చెప్పారు. నిరాధార ఆరోపణలతో సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడం సరికాదన్నారు.
సమితి కోశాధికారి నామని సుగుణ మాట్లాడుతూ సమితి అభివృద్ధి చెందుతుండటాన్ని ఓర్వలేకనే నామని హరికృష్ణ తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. రూపాయి నుంచి ప్రారంభమైన సమితి నేడు ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. మదర్ థెరిస్సా ఆశయాలను, మహిళల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.
సమితిపై తప్పుడు ఆరోపణలు చేసిన విషయాన్ని సంబంధిత శాఖ అధికారులు సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సమితి సభ్యులు కోరారు. సంస్థకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికే ఈ విలేకరుల సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో సమితి డైరెక్టర్లు ఎలగందుల సరిత, పుల్లె లక్ష్మి, పుల్లె రాజేశ్వరి, తాత యాదమ్మ, ముప్పిడి మల్లేశ్వరి, ఎర్ర రాజేశ్వరి, మైదం శారద తదితరులు పాల్గొన్నారు.

