పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 15:
ఎరువుల ధరల పెంపుతో రైతులపై కేంద్ర ప్రభుత్వం అదనపు భారం మోపుతోందని రాజాపూర్ గ్రామ ఉపసర్పంచ్ కలవేన శ్రీకాంత్ ముదిరాజ్ విమర్శించారు.
ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు పెరగడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎరువుల ధరలను పెంచడం వల్ల చిన్న, సన్నకారు రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ముందుగా సాగు వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటు ధరల్లో సరఫరా చేసి, పెంచిన ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చే నిర్ణయాలు తీసుకోవాలని కలవేన శ్రీకాంత్ ముదిరాజ్ కోరారు.

