భీమారం (మంచిర్యాల),అర్జున్ సమాచారం, జూలై 20:
భీమారం మండలోని ఆరెపల్లి గ్రామ పంచాయతీ భవనంలో ఉచిత న్యాయ సలహా మరియు అవగాహన సదస్సు (న్యాయ విజ్ఞాన సదస్సు) అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు కోర్టు గౌరవనీయులైన జడ్జి శ్రీ పార్వతపు రవి హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, చిన్న చిన్న వివాదాలను కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీ మార్గాల ద్వారా పరిష్కరించుకోవడానికి న్యాయ సేవా అధికార సంస్థ అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ప్రతి ఒక్కరికీ న్యాయ సహాయం పొందే హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సదస్సులో చెన్నూరు బార్ అసోసియేషన్ న్యాయవాది కాగితపు మహేష్, బండారి శ్రీనివాస్, పున్నం, ప్రభాకర్, సంజీవ్ తదితరులు పాల్గొని ప్రజలకు వివిధ చట్టాలు, మహిళా రక్షణ చట్టాలు, భూ వివాదాల పరిష్కారాల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో భీమారం సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్.ఐ)ఏ. రాజేందర్ పాల్గొని గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అరేపల్లి గ్రామ సర్పంచ్ ఆకుదారి వీరయ్య మాట్లాడుతూ తమ గ్రామంలో ఇలాంటి న్యాయ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సదస్సులో గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమకున్న న్యాయపరమైన సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

