వివరాల సేకరణను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి.. రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళ్లికేరి.
అర్జున్ సమాచారం జులై 07 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి:
ఆగస్టు 07, 2026:జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్బుక్ తయారీకి అవసరమైన గ్రామ డైరెక్టరీ, పట్టణ డైరెక్టరీ వివరాల సేకరణను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళ్లికేరి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జన గణన సంచాలకులు మాట్లాడుతూ భారత ప్రభుత్వ రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ కార్యాలయం- న్యూఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర జనగణన సంచాలకుల కార్యాలయం మార్గదర్శకాల మేరకు జిల్లాల పరిధిలో అన్ని చార్జ్ల పరిధిలో ఫీల్డ్ ఫంక్షనరీలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ శిక్షణల ద్వారా సమాచార సేకరణ, నమోదు ప్రక్రియలో ఏకరూపత, ఖచ్చితత్వం, నాణ్యతను నిర్ధారించేందుకు సమగ్ర అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలు, పట్టణాలకు సంబంధించిన విద్య, ఆరోగ్యం, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, రవాణా, బ్యాంకింగ్ సేవలు, పోస్టల్ సేవలు, వ్యవసాయం, మార్కెటింగ్ సౌకర్యాలు, సామాజిక, ఆర్థిక మౌలిక వసతులు, ప్రభుత్వ సేవలు తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి జిల్లా జనగణన హ్యాండ్బుక్ వెబ్ పోర్టల్లో నమోదు చేసే విధానంపై క్షేత్ర సిబ్బందికి తగు శిక్షణ అందించాలని తెలిపారు. చార్జ్ అధికారులు తమ పరిధిలోని ఫీల్డ్ ఫంక్షనరీలకు అవసరమైన సాంకేతిక సహకారం అందించడంతో పాటు, వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ప్రతి గ్రామం, పట్టణానికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని సూచించారు. నమోదయ్యే ప్రతి సమాచారం సంపూర్ణంగా, ఖచ్చితంగా, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. హ్యాండ్ బుక్ పార్ట్ – ఎ లో గ్రామ, పట్టణ డైరెక్టరీలు, పార్ట్ – బి లో ప్రాథమిక గణన సారాంశం ఉంటాయని తెలిపారు. మొబైల్ యాప్, వెబ్ పోర్టల్, అవసరమైతే భౌతిక షెడ్యూల్ ద్వారా సమాచార సేకరణ జరుగుతుందని తెలిపారు. ఛార్జ్ అధికారుల బాధ్యతలు, ఫీల్డ్ సిబ్బంది నియామకం, యూజర్ ఐడీల సృష్టి, శిక్షణ నిర్వహణ, ఫీల్డ్ వర్క్ పర్యవేక్షణ, డేటా ధృవీకరణ, గౌరవ వేతనాల పంపిణీ, నిర్ణీత గడువులో పనుల పూర్తి వంటి అంశాలు పొందుపరచబడి ఉంటాయని, డేటా నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామ/పట్టణ కోడ్లు సక్రమంగా నమోదు చేయాలని, తప్పనిసరి వివరాలన్నీ నమోదు చేయాలని, డూప్లికేట్ సమాచారం లేకుండా సంబంధిత శాఖల రికార్డులతో సరిపోలే విధంగా సమాచారాన్ని నమోదు చేయాలని తెలిపారు. డేటా భద్రత పరంగా యూజర్ ఐడీ, పాస్వర్డ్లను గోప్యంగా ఉంచాలని, అధికారిక యాప్, పోర్టల్ మాత్రమే ఉపయోగించాలని, అధికారిక సమాచారాన్ని సోషల్ మీడియా / వ్యక్తిగత మెసేజింగ్ ద్వారా పంచరాదని, పని పూర్తయిన వెంటనే లాగ్ అవుట్ చేయాలని తెలిపారు. అలాగే ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం సహాయ వ్యవస్థ అందుబాటులో ఉంటుందని తెలిపారు.
జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ నుండి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మొహమ్మద్ విలాయత్ అలీ, సంబంధిత అధికారులు హాజరయ్యారు. అనంతరం జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన హ్యాండ్బుక్ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన, మౌలిక వసతుల అభివృద్ధి, విధాన నిర్ణయాలు, పరిశోధనలకు ప్రామాణిక సమాచార గ్రంథంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ప్రక్రియలో భాగస్వాములైన అన్ని చార్జ్ అధికారులు, ఫీల్డ్ ఫంక్షనరీలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, సమాచార సేకరణ, వెబ్ పోర్టల్లో నమోదు ప్రక్రియను నిర్దేశిత గడువులోగా విజయవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాకు సంబంధించిన గ్రామీణ, పట్టణ ప్రాంతాల సామాజిక, ఆర్థిక, మౌలిక వసతులపై సమగ్ర సమాచారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి, భవిష్యత్ ప్రణాళికాబద్ధ అభివృద్ధికి బలమైన పునాది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేంద్ర రాథోడ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, ముఖ్య ప్రణాళిక అధికారి, ఉప గణాంక అధికారి రాజేందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

