ప్రతి ఉపాధ్యాయుడు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణను ఆకస్మికంగా పరిశీలించిన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు”
ఆసిఫాబాద్, జూలై 29: అర్జున్ సమాచారం ప్రతినిధి జూలై29.
కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఐదు రోజుల విషయాల వారీ శిక్షణ కార్యక్రమాన్ని రెండవ రోజు వ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.
శిక్షణ జరుగుతున్న ప్రతి సబ్జెక్టు తరగతిని స్వయంగా సందర్శించిన ప్రాజెక్ట్ అధికారి ఒక్కో తరగతిలో సుమారు గంటసేపు ఉపాధ్యాయులతో కలిసి కూర్చొని శిక్షణా విధానాన్ని శ్రద్ధగా పరిశీలించారు. శిక్షకులు బోధిస్తున్న అంశాలను ఆసక్తిగా విని, ఉపాధ్యాయులతో పరస్పరం చర్చిస్తూ బోధనలో నాణ్యత, వినూత్న బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యాస ఫలితాల మెరుగుదలపై పలు సూచనలు చేశారు.
శిక్షణ అనేది కేవలం హాజరు కార్యక్రమంగా కాకుండా, ప్రతి ఉపాధ్యాయుడి వృత్తి నైపుణ్యాలను పెంపొందించే అవకాశంగా భావించి పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న ఆధునిక బోధనా విధానాలను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేసి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
ప్రాజెక్ట్ అధికారి స్వయంగా శిక్షణా తరగతుల్లో పాల్గొని పరిశీలించడం ఉపాధ్యాయుల్లో మరింత ఉత్సాహాన్ని నింపిందని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ, పీఎంఆర్సీ ఏసీఏఎంఓ పూర్క ఉద్ధవ్, జీసీడీఓ కొట్నాక్ శకుంతల, జిల్లా క్రీడల అధికారి మాడావి శేఖు, కోర్సు డైరెక్టర్ కోడెం రవీందర్ ప్రధానోపాధ్యాయులు, లింభారావు రీసౌర్స్ పర్సన్ శిక్షణ సమన్వయకర్తలు మరియు వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

