శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం: దిగువ ప్రాంత ప్రజలకు హై అలెర్ట్
రామగుండం (ప్రత్యేక ప్రతినిధి): జూలై 30
కడెం ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయడం, అలాగే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువన ఉన్న పరివాహక ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రామగుండం విభాగం నం.7 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) పి. రవీంద్ర చారీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. వరద నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున, ముఖ్యంగా ప్రాజెక్టు దిగువన ఉన్న గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు, రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు మరియు పల్లెకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ నది ఒడ్డుకు లేదా నదీ ప్రవాహంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మిత్రులు ఈ సమాచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అలాగే పోలీస్, రెవెన్యూ మరియు ఇతర ప్రజాప్రతినిధులు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ దిగువ గ్రామాల ప్రజలను చైతన్యపరచాలని కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే తక్షణమే చర్యలు చేపట్టేలా స్థానిక యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని సూచించారు.

